ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విపక్షాలు చేసే విమర్శల్లో కొన్ని అంశాలు కామన్గా ఉంటుంటాయి.
అలాంటి వాటిల్లో సలహాదారుల నియామకం ఒకటి. తాజాగా ఇదే విషయంలో మరోమారు ఇబ్బంది ఎదురైంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పని తక్కువ ప్రచారర్భాటం ఎక్కువ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. రూ.5తో పేదలకు అన్నం పెట్టడానికి డబ్బుల్లేవంటూ కోట్ల రూపాయలను ప్రకటనలకు ఎందుకు తగలేస్తున్నారని మండిపడ్డారు. సలహాదారులకు లక్షలకొద్దీ జీతాలిస్తూ, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.
బాబు చేసిందే జగన్….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పని తక్కువై, ప్రచార ఆర్భాటం, ప్రజల సొమ్ము వృథాగా ఖర్చుచేయడం ఎక్కువైందని తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు అనిత ఆరోపించారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, రంగులుమార్చి అమలుచేయడంపై ఉన్న శ్రద్ధ, వాటిని కొనసాగించడంపై లేకుండా పోయిందని టీడీపీ మహిళానేత దెప్పి పొడిచారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వంగలపూడి అనిత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, సంపూర్ణ పోషణ ప్లస్ పథకం, రెండు కూడా చంద్రబాబు ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో అమలు చేసినవేనని చెప్పుకొచ్చారు.
మహిళలను మోసం చేస్తున్నారట
మహిళలను మోసగించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మితిమీరిన ఖర్చుతో ప్రచారం చేసుకుంటోందని వనిత విమర్శించారు. గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఫుడ్ బాస్కెట్, అన్న అమృతహస్తం, బాల సంజీవని, బాలామృతం, పథకాలను టీడీపీ ప్రభుత్వం సమగ్రంగా అమలుచేసిందని తెలిపారు. రంగులు, పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడం తప్ప, వాస్తవంలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా చేస్తున్నదేమీ లేదని మండిపడ్డారు. చంద్రబాబు హాయాంలో పథకాలకు పేర్లుమారుస్తున్న ప్రభుత్వం, కొత్తసీసాలో పాతసారా నింపుతోందని, పథకాలను ఆరంభించడంలో ఉన్న శ్రద్ధ, పాలకులకు వాటిని కొనసాగించడంలో ఉండటం లేదని అనిత దుయ్యబట్టారు.
పాత మాటే కదా?
సన్నబియ్యం ఇస్తామని గతంలో చెప్పి, దాని గురించి ప్రశ్నించిన వారిపై బూతు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోట్లకు కోట్ల ప్రకటనలు ఇస్తున్నప్రభుత్వం, పేదలకు మాత్రం రూ.5తో భోజనం పెట్టలేకపోతోందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం సలహాదారులకు లక్షలకొద్దీ జీతాలిస్తూ, కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ, ప్రచారానికి కోట్లరూపాయలు ఖర్చుచేస్తూ, ప్రజలను, రోజువారీ కూలీలను ఆకలి బాధలకు గురిచేస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ విమర్శలు గతంలో చేసినవే అయినప్పటికీ, మళ్లీ వాటినే తిరగదోడిన నేపథ్యంలో అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.