ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుత కందుకూరు వైసిపి శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగం పై మరోసారి మండిపడ్డారు.జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం తీరు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తనకు ఇదే అనిపిస్తోందని ఆయన చెప్పారు.అధికారులు వ్యవహరించిన తీరుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని ఎమ్మెల్యే ఘాటుగా పేర్కొన్నారు.కాగా మహీధర్రెడ్డి అధికార యంత్రాంగంపై విరుచుకుపడటం ఇది మూడోసారి.మొదటిసారి ఆయన జిల్లా కలెక్టర్ మీదనే బరస్ట్ అయ్యారు.కరోనా నియంత్రణలో కలెక్టర్ పోలా భాస్కర్ విఫలమయ్యారంటూ బహిరంగ ప్రకటన చేశారు.తదుపరి మరో సందర్భంలో తన నియోజకవర్గంలో జరిగిన పనుల తాలూకు బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించక పోవటాన్ని నిరసిస్తూ మహీధర్ రెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట బైటాయించారు.ఆ బిల్లులను జిల్లాపరిషత్ సీఈవో మంజూరు చేసే వరకు ఆయన తన ఆందోళనను విరమించలేదు.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయన మళ్లీ అధికారులను టార్గెట్ చేశారు.తన నియోజకవర్గ పరిధిలోని లింగసముద్రం మండలం పెగడపల్లిలో అన్యాక్రాంతమైన డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లను కొట్టుకుపోతుంటే అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోందని ఆయన మీడియాకు చెప్పారు.అసలు ఈ భూములు అన్యాక్రాంతం కాగా తాను లోకాయుక్తకు వెళ్లి వాటిని ప్రభుత్వపరం చేశానన్నారు.ఆ భూముల్లో ఉన్న టేకు చెట్లను అక్రమార్కులు దర్జాగా కొట్టుకుపోతుంటే అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆయన తెలిపారు.గతంలో ఇరవై లక్షల రూపాయల విలువైన టేకు చెట్లను కొట్టేశారన్నారు.వారం రోజుల క్రితం పది లక్షల విలువైన టేకు చెట్లను కొడుతుండగా స్థానికులు అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఏ ఒక్కరూ స్పందించి చర్యలు తీసుకోలేదన్నారు.నరికేసిన టేకు చెట్లను చూసిన అటవీశాఖాధికారులు కూడా కేసు నమోదు చేయలేదన్నారు.
టేకు చెట్లు నరకాలంటే అటవీశాఖ అనుమతి కావాలని అందుకు విరుద్ధంగా అనుమతి లేకుండా టేకు చెట్లను కొట్టినట్లయితే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు అటవీశాఖాధికారులకు ఉందన్నారు. టేకు చెట్లను కొట్టిన వారిపై కేసులు నమోదు చేసే అధికారం కూడా వారిదే అన్నారు ఆ పనిని అటవీశాఖాధికారులు చేయక పోవడమేమిటని ప్రశ్నించారు.ఇదంతా చూస్తుంటే జిల్లా యంత్రాంగం డివిజన్ యంత్రాంగం మండలస్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చునని మహీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి ,సంబంధిత శాఖల మంత్రులకు నివేదిస్తానని ఆయన చెప్పారు.వారు కూడా మహీధర్ రెడ్డి లేవనెత్తిన అంశం మంచిదే అయినప్పటికీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి బహిరంగ విమర్శలు చెయ్యడం వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడే ప్రమాదం ఉందంటున్నారు.మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.