కరోనా వైరస్ వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాలను ఊహించని విధంగా మార్చేసిందన్న విషయం తెలిసిందే. దీని ధాటికి అన్ని పరిశ్రమలు సంక్షోభంలో మునిగిపోయాయి. ఇక ఈ కోవిడ్ కారణంగా సినిమా థియేటర్లు లేకపోవడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలకు ఓటీటీ వేదికగా మారింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గిపోతుండటంతో సినిమాలన్ని షుటింగ్స్ జరుపుకుంటున్నాయి.
కాగా కరోనా కారణంగా మార్చిలో మూత పడ్డ థియేటర్లు దాదాపు ఎనిమిది నెలల తర్వాత ప్రస్తుతం తెరుచుకుంటున్న క్రమంలో ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో జనాలను థియేటర్లకు రప్పించడం తలనొప్పిగా మారిందట. అందుకే థియేటర్స్ యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇన్నిరోజులు ఓటీటీ లో సినిమాలను చూడడానికి అలవాటుపడ్దారు జనాలంతా..మరి ప్రేక్షకులతో థియేటర్లకు పూర్వ వైభవం తెప్పించడం అంత సులువు కాదు. అందుకే వారికి థియేటర్లను అలవాటు చేసేందుకు గాను ఓటీటీలో ఈమధ్య విడుదల అయిన సినిమాలను థియేటర్లలో కూడా ప్రదర్శించాలనే నిర్ణయానికి వచ్చారట.
అయితే ఇదివరకు థియేట్లలో ఓటీటీ సినిమాలను విడుదల అవ్వనిచ్చేది లేదని థియేటర్ల సంఘం పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్దితుల్లో థియేటర్లు ఖాళీగా ఉండకుండా.. పాత సినిమాలు వేయకుండా ఉండేందుకు గాను ఓటీటీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో థియేటర్ల సంఘం వారికి, నిర్మాతలకు మధ్య ఒప్పందం కుదిరిందట. దీంతో దిల్ రాజు నిర్మించిన ‘వి’ నుండి రీసెంట్ గా యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ వరకు ఓటీటీలో రిలీజైన సినిమాలను థియోటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. అలా ప్రదర్శింపగా వచ్చిన లాభాలను షేర్ చేసుకునే ఒప్పందంతో థియేటర్లలో విడుదల చేయబోతున్నారట. ఇక ఈ విషయంలో త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.