అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఎన్నికల సంఘం అభివృద్ధిని అడ్డుకుంటోందని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆరోపించారు.
అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసి వ్యవహారాల్లో వైసిపి నేతల జోక్యం ఎక్కువ అయిందని విమర్శించారు. క్యాబినెట్ ఆమోదించిన బిల్లులు ఇవ్వవద్దని చెప్పడానికి విజయసాయిరెడ్డికి ఏమి అధికారం ఉందని సోమిరెడ్డి ప్రశ్నించారు. బిల్లులు నిలిపివేస్తే పోలవరం ప్రాజెక్టు కింద రైతులు ఒక సీజన్ పంటను కోల్పోతారని సోమిరెడ్డి అన్నారు.
ఎన్నికల సంఘం నాల్గవ విడత రుణ మాఫీ నిధులు 500కోట్లు అడ్డుకోవడం, సిఎం సహాయ నిధి కింద ఇచ్చిన చెక్కులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని సోమిరెడ్డి అన్నారు.
బాధితులకు చెక్కులను ఆపించి వైసిపి వారు రాక్షస ఆనందం పొందుతున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టిడిపి విజయాన్ని అడ్డుకోలేరని సోమిరెడ్డి స్పష్టం చేశారు.