ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బస్సుల రాజకీయం నడుస్తున్నది. కరోనా లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని సొంత రాష్ట్రం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముందుకొచ్చారు. వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రియాంక లేఖ రాయగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకరించారు. ఇదిలా ఉండగా లాక్డౌన్ నియమాలు ఉల్లంఘిస్తూ వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేశారన్న ఫిర్యాదుపై కాంగ్రెస్ నేతలపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.
వలస కార్మికులను ఎక్కించుకుని నోయిడాకు మాంగళవారం రాత్రి 100 బస్సులు బయలు దేరాయి. బుధవారం వీటిని పోలీసులు అడ్డుకున్నారు. 20 మంది కాంగ్రెస్ నేతలు దీనికి కారణమనీ, లాక్డౌన్ నియమాలు ఉల్లంఘించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ మాలిక్ కూడా ఉన్నారు. దాంతో పాటు వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేరవేస్తున్న రెండు బస్సులను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ రెండు బస్సులకు 2019 ఏప్రిల్ 2తోనే ఫిట్నెస్ వ్యాలిడిటీ పూర్తయిపోయిందని, అన్ని చెకింగ్ లు పూర్తయిన తర్వాతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందనీ పోలీసులు పేర్కొంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనిని కూడా రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
దీనిపై ట్విట్టర్ వేదికగా ప్రియాంక గాంధీ స్పందించారు.’వలస కార్మికుల నిమిత్తం బస్సులు అందుబాటులోకి వచ్చి సరిగ్గా 24 గంటలవుతోంది. బస్సులపై బీజేపీ జెండాలు, బీజేపీ స్టిక్కర్లు అంటించాలని అనుకుంటే అలాగే చేయండి. కానీ మాకు అనుమతినివ్వండి. మేమే బస్సులను అందుబాటులోకి తెచ్చామని ప్రచారం చేయాలనుకుంటే అలాగే కానీయండి. కానీ… బస్సులు నడిచేలా చూడండి. అనుమతినివ్వండి’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.