న్యూఢిల్లీ : కరోనా లాక్ డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి కేంద్రం డబ్బు చేర్చాలని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పేదల జీవితాలు మరింత దుర్భర స్థితిలోకి జారుకునే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. లాక్ డౌన్ సంక్షోభం కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలకు కూడా ప్రభుత్వమే అండగా నిలవాలని సూచించారు. ఈ సమయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్రం మద్దతు లేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మనుగడ సాగించడం కష్టతరం అవుతుందని అన్నారు.
లాక్డౌన్తో వైరస్ను కట్టడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విఫలమైందని ఆయన విమర్శించారు. నాలుగు దశల లాక్డౌన్ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మోదీ, అతని సలహా సిబ్బంది అబద్దపు ప్రచారం చేస్తున్నారనీ, వాస్తవానికి అలా జరగడం లేదనీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఒక్క సోమవారం రోజున దాదాపు ఏడు వేల కొత్త కేసులు నమోదయ్యాయనీ, ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. మంగళవారం నాటికి దేశంలో 1.45 లక్షల కేసులు దాటాయనీ, వైరస్ బారిన పడి 4167 మంది ప్రాణాలు కోల్పోయారనీ రాహుల్ పేర్కొన్నారు. కరోనా కేసులు ఎక్కవ అవుతున్న తరుణంలో ప్రపంచంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న ఏకైక దేశం భారత్ యేనని అయన ఎద్దేవా చేశారు.
కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో దాని కట్టడికి అనుసరించే ప్రణాళికలు ఏమిటో కేంద్ర ప్రభుత్వం వివరించాలని రాహుల్ కోరారు. అలాగే రాష్ట్రాలకు, వలస కూలీలకు ఎలా అండగా నిలవనుందో తెలియచేయాలని డిమాండ్ చేశారు. భారత్లో రెండో విడత కరోనా విజృంభిస్తే దాని పరిణామాలు మరింత తీవ్రంగా ఉండవచ్చని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.