Aiims Chief: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా పూర్తిగా కట్టడి కాలేదు. మరో వైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందంటూ వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు.
వచ్చే ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన గులేరియా..ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం మహమ్మారి నుండి బయటపడి మునుపటి పరిస్థితికి వెళ్లవచ్చని అన్నారు. దేశంలో మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని ఆయన తెలిపారు. ప్రధానంగా పండుగల సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తనకు కరోనా రాదనే భ్రమలో ఉండరాదనీ, వారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒక వేళ కరోనా సోకినా అది లేలికపాటి ధశకే పరిమితం అవుతుందని అన్నారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరం కాకుండా చూస్తుందని తెలిపారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి తిరోగమనంలో సాగుతోందనీ, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన హెచ్చరించారు. కేసుల సంఖ్య మళ్లీ పెరిగే పరిస్థితి తీసుకురాకూడదని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ ఉండాలనీ, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దని గులేరియా సూచించారు.
కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాస్కులు అయితే ధరిస్తున్నారు కానీ ఎక్కడా భౌతిక దూరం పాటిస్తున్న దాఖలాలు కనబడటం లేదు. వివిధ మార్కెట్లు జనసమర్ధంతోనే కొనసాగుతున్నాయి. అధికారుల సూచనలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
విద్యాసంస్థలను కూడా తెరవడంతో పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా అక్కడక్కడా కరోనా బారిన పడుతున్నారు. అయితే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించకుండా ఉండేందుకు ఎయిమ్స్ చీఫ్ సూచనల మేరకు మరో ఆరు నుండి ఎనిమిది వారాల పాటు జాగ్రత్తలు పాటించాలి.