Chotta Rajan: అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ శుక్రవారం కోవిడ్ తో మృతి చెందినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అధికారులు కొట్టిపారేశారు. చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నాడని స్పష్టం చేశారు.ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 61 ఏళ్ల చోటా రాజన్ ఏప్రిల్-26న కరోనా బారినపడటంతో ట్రీట్మెంట్ కోసం అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు అధికారులు.
అప్పటినుంచే రాజన్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కాసేపటికే అందులో నిజం లేదని ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా స్పష్టం చేశారు. అతను చనిపోయాడంటూ వెలువడిన వార్తలు నిజం కాదని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయనకు కరోనా చికిత్స అందిస్తున్నామని డాక్టర్ మల్హోత్రా తెలిపారు.
Chotta Rajan: డెబ్బై కేసుల్లో నిందితుడు!
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడిగా భారత్లో అనేక నేరాలకు పాల్పడిన చోటా రాజన్ ని 2015లో ఇండోనేషియాలోని బాలిలో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2011లో ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో గతేడాది కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. రాజన్పై ఉన్న దాదాపు 68 కేసులను సీబీఐ విచారిస్తుండగా.. ఇందులో ఇప్పటికే 4 కేసుల్లో కోర్టులు అతన్ని దోషిగా తేల్చాయి. మరో 35 కేసుల్లో సీబీఐ అధికారుల చార్జిషీట్ దాఖలు చేశారు. వీటిపై తుది విచారణ ఇంకా జరగాల్సి ఉంది.
బ్లాక్ మార్కెటీర్ టూ గ్యాంగ్స్టర్!
చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. తొలుత దావూద్ ఇబ్రహీం అనుచరుడుగా ఉన్న చోటా రాజన్.. దావూద్ తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొన్నాడు. బొంబాయిలో సినిమా టిక్కెట్ల బ్లాక్ మార్కెటీర్ గా జీవితాన్ని ప్రారంభించిన రాజన్ అనతి కాలంలోనే నేర సామ్రాజ్యంలో కింగ్ పిన్ అయ్యాడు.బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముతున్న రాజన్ ను పట్టుకున్నందుకు పోలీసులను అతను చితకబాదడంతో జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చాక బడా రాజన్ గ్రూపులో చేరాడు.బడా రాజన్ హత్యకు గురయ్యాక ఆ గ్యాంగ్ కి రాజన్ నాయకుడయ్యాడు.అందువల్ల అతనికి చోటారాజన్ అన్న పేరు వచ్చింది.ఇక ఆతరువాత దావూద్ ఇబ్రహీంతో చేతులు కలిపాడు. అనంతరం ఆయనతో విడిపోయి సొంతంగా నేర సామ్రాజ్యం నడిపాడు.