న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు టెలికామ్ సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. వోడాఫోన్-ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు మొబైల్ టారిఫ్ లు ఈ నెల నుంచి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. నష్టాలను పూడ్చుకోవడానికి, ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భారం మోపుతున్నాయి. తాజాగా ఎయిర్టెల్ ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది. రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ కాలపరిమితిని భారీగా తగ్గించింది. ఏకంగా 26 రోజులు తగ్గించి భారీ షాక్ ఇచ్చింది. కాలపరిమితిని తగ్గించినా మిగతా ప్రయోజనాలను మాత్రం యథాతథంగా ఉంచింది. ఎయిర్టెల్ రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్లో ఇప్పటి వరకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్లు 82 రోజుల కాలపరిమితితో లభించేవి. ఇప్పుడు మిగతా ప్రయోజనాలను అలాగే ఉంచి కాలపరిమితిని 82 రోజుల నుంచి 56 రోజులకు తగ్గించింది. అంటే ఏకంగా 26 రోజులన్న మాట.
ఫొటోగ్రఫీ నుంచి మ్యూజిక్ వరకు ఏదైనా ఇష్టమైన కోర్సును ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. షా అకాడమీ ద్వారా నాలుగు వారాలపాటు ఈ కోర్సు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అలాగే, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. జీ5, హూక్, 370కిపైగా లైవ్ టీవీ చానళ్లు, 10 వేలకు పైగా సినిమాలు వీక్షించవచ్చు. దీంతోపాటు ఫాస్టాగ్పై రూ.100 క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఈ ప్యాక్ అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కూడా మొబైల్ ఫోన్ల టారిఫ్ను పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్లతో పోలిస్తే 39 శాతం ధరలను పెంచిన జియో, ఈ ధరలు టెలికామ్ రంగంలోని ఇతర ప్రధాన సంస్థలు వసూలు చేస్తున్న ధరలతో పోలిస్తే తక్కువేనని పేర్కొంది. గతంలో ఉన్న ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో పోలిస్తే, 300 శాతం అదనపు లాభాలను వినియోగదారులు పొందవచ్చని తెలిపింది. రోజుకు 1.5 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్యాక్ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా, అది రూ. 555కు పెరిగింది. ఇప్పటివరకూ రూ. 153గా ఉన్న ప్లాన్ ధర, రూ.199 అయింది. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారీగా నష్టాలు చవిచూడటంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.