తాజాగా విద్యుత్ పేరుచెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు చాలా అలజడినే సృష్టించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైకాపా కు సంబందించిన నాయకులు కాకుండా సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పందించారు. కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్ విద్యుత్ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని.. పరిశ్రమలకు యూనిట్కు రూ.7.65 చొప్పున వసూలు చేయాలని 2017లో టీడీపీ సర్కార్ చేసిన నిర్ణయంలో తామెలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.
దేశంలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ను తెలంగాణ రూ.7.60, మహారాష్ట్ర రూ.7.25, రాజస్తాన్ రూ.7.30, కర్ణాటక రూ.7.20, తమిళనాడు రూ.6.35 చొప్పున సరఫరా చేస్తుంటే… ఏపీ రూ.6.65 చొప్పున సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ఆ సంగతులు అలా ఉంటే… రాష్ట్రంలో కుటుంబ పాలన, కులం, అవినీతిని రూపుమాపాలనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్న కల్లం… వాటిపై పోరాటం చేసే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ విషయంపై లోకేష్ కు బాబుకు కలిపి సెటైర్ వేసిన ఆయన… ఎన్నడూ ప్రజా జీవితంలో లేకున్నా, ఎలాంటి అర్హతలు లేకున్నా, ఎమ్మెల్యే కాకున్నా.. కేవలం కొడుకు అనే ఏకైక కారణంతో మంత్రిని చేసిన కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలనే ఆమె అభిప్రాయాలను గౌరవిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయాలతో అంతా బాగానే ఉంది కానీ… పార్టీకి సంబందించినవారెవరూ స్పందించకపోవడంతో రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. విమర్శలు చేసింది కేంద్రమంత్రి అయినప్పుడు.. వాటికి సమాధానాలు కూడా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి నుంచి వచ్చి ఉంటే బాగుండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వ సలహాదారుతో చెప్పించడాన్ని… బీజేపీ పట్ల జగన్ ప్రభుత్వం బయపడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.