(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: కొందరు సైబర్ నేరగాళ్లు ప్రముఖ ఆలయాల పేరుతో నకిలీ వెబ్సైట్లను ఏర్పటు చేసి భక్తులను మోసం చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్ సైట్ను ఏర్పాటు చేసి భక్తులను మోసం చేస్తున్నట్లు ఇటీవల ఆలయ అధికారులు గుర్తించారు. దీనిపై ఆ ఆలయ కార్యనిర్వహణ అధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పేరుతోనూ నకిలీ వెబ్సైట్ నడుపుతున్నట్లు అలయ అధికారులు గుర్తించారు. దేవస్థానంలో ఆర్జిత సేవలు, దర్శనం, గదుల కేటాయింపు సేవలను ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చంటూ నకిలీ సైట్లలో ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మూడు సంస్థలు ఈ వెబ్సైట్లను ఇంటర్నెట్లో ఉంచినట్లు తెలుసుకున్నారు. దుర్గగుడితో పాటు నెమలి వేణుగోపాలస్వామి, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి), అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాల సేవలు కూడా నకిలీ వెబ్సైట్లు తెరిచినట్లు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. నకిలీ వెబ్ సైట్లపై విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావుకు దుర్గగుడి ఇఒ ఫిర్యాదు అందజేశారు. విజయవాడ పోలీసులు ఈ కేసును సైబర్ క్రైమ్ బదిలీ చేసే అవకాశం ఉంది. ఇంత వరకూ ఎంత మంది భక్తులు మోసపోయారన్న విషయం తెలియరాలేదు.