ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఆంధ్రప్రదేశ్ కు మరో మూడ్రోజులు భారీ వర్షాలు తప్పేట్లు లేవు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది.
కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది .ఉత్తర కోస్తా ఒరిస్సా వాయువ్య బంగాళాఖాతం గ్యాంగ్ టెక్ పశ్చిమబెంగాల్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు 9.5 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికార్లు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది.
ఆదివారం నాడు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అటు విశాఖపట్నంలో భారీ వర్షం పడవచ్చు.మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చు. దక్షిణ కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు..మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరికను ఎగరేశారు.మహారాష్ట్ర ప్రాంతం నుంచి భారీ పరిమాణంలో వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతోంది. ఇప్పటికే బ్యారేజీలో 11.75 అడుగుల మేర నీటి మట్టం ఉంది. ముందు జాగ్రత్త చర్యగా బ్యారేజీ అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.ఇంకా వర్షాలు కొనసాగినట్లయితే గోదావరికి వరద రావచ్చునని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు!