(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నుండి ఇంకా తేరుకోకముందే మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షలను యూనివర్శిటీలు తిరిగి నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు బయటకు వచ్చే పరిస్థితి లేదు.
దీంతో అన్ని రకాల పరీక్షలను దసరా పండుగ పూర్తి అయ్యే వరకూ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆదేశాలతో ఉస్మానియా యూనివర్శిటీ, జెఎన్టీయు, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబిఎ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలు వాయిదా పడ్డాయి.