Ram Charan: ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఇటు రావే వయ్యారి.. అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్యకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయిన రామలింగయ్య పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఐతే తాజాగా అలనాటి హాస్య కళాప్రపూర్ణ గురించి మనవడు రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా వ్యాఖ్యలు టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అల్లు రామలింగయ్య జైల్లో పెట్టడానికి కారణం ఇదే
చాలామందికి అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) ఒక హాస్య నటుడిగా మాత్రమే పరిచయం. అతను ఓ హోమియోపతి డాక్టర్ అని చాలా మందికి తెలియక పోవచ్చు. అంతేకాదు, ఆయన గురించి ప్రపంచానికి తెలియని విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు అల్లు రామలింగయ్య గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అయితే ఆ సమయంలోనే అతన్ని జైల్లో వేశారని రామ్ చరణ్ తాజాగా వెల్లడించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన తాతయ్య గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని చెర్రీ చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. 1940 కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన తాతయ్య హక్కులపై పోరాటం చేశారని చెర్రీ చెప్పుకొచ్చాడు. గుండె ధైర్యంతో పోరాటంలో పాల్గొనడంతో బ్రిటిష్ పోలీసులు తన తాతయ్యని అరెస్టు చేశారని.. అలా 15 రోజులకు పైగా ఆయన జైలులోనే గడిపారని వెల్లడించాడు. ఈ విషయం గురించి తన కుటుంబ సభ్యుల్లో కొద్ది మందికి తప్ప ఎవరికీ తెలియదని రామ్ చరణ్ తెలిపాడు. విశేషమేమిటంటే.. జైల్లో ఉన్న సమయంలోనూ అక్కడి వారందరినీ పోగేసి నాటకాలు వేశారు రామలింగయ్య.
జనవరి 7న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
గోండు వీరుడు కొమురం భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుందనే ఒక కాల్పనిక కథ ఆధారంగా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీని రూపొందించారు రాజమౌళి. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విస్తృతంగా ప్రమోషన్లు చేపట్టింది చిత్రబృందం.