Amanchi Krishna Mohan :న్యాయ స్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైకోర్టు రిజిస్ట్రార్ పెట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే, చీరాల నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం నాడు విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయం లో విచారణకు హాజరయ్యారు.
ఈ నెల ఆరో తేదీన విచారణకు రమ్మని సీబీఐ డీఎస్పీ శ్రీనివాసరావు నోటీసులు పంపినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆ రోజున హాజరుకాలేదు.కొద్దిగా వ్యవధి ఇవ్వాలని కోరగా శుక్రవారం రమ్మని సీబీఐ మళ్లీ నోటీసులు ఇవ్వడంతో ఆయన న్యాయవాది కర్నేటి రవితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు ఈ కేసు విషయమై హైకోర్టు నుండి తనకు నోటీసులు అందినప్పుడు తాను తన న్యాయవాది ద్వారా వివరణ ఇవ్వడం జరిగిందన్నారు.ఇప్పుడు కేసు సీబీఐకి బదలాయించారు కాబట్టి అవే విషయాలు తెలియజేస్తానన్నారు.తాను కోర్టును గాని న్యాయమూర్తులనుగానీ అగౌరవపరచలేదని ఆమంచి స్పష్టం చేశారు. ఈ కేసు పూర్వపరాలిలా ఉన్నాయి.
కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులకు కనీస రక్షణ సామగ్రి లేదని నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ బహిరంగంగా విమర్శించారు.ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో సదరు డాక్టర్ ను పోలీసులు నిర్బంధించడం, మానసికస్థితి సరిగ్గా లేదంటూ మెంటల్ హాస్పిటల్ కి తరలించటం వంటి పరిణామాలు చోటు చేసుకోగా హైకోర్టు వరకు విషయం వెళ్లింది.ఈ కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
ఈ తీర్పుపై వైసిపి అగ్ర నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ,ఆమంచి కృష్ణమోహన్ తదితరులు విమర్శలు చేశారు.గత ఏడాది జులై 8న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని.. చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమంచి కోర్టు తీర్పును ఘాటుగా విమర్శించారు.మొత్తం తొంభై ఎనిమిది మంది వైసిపి నేతలు,సోషల్ మీడియా కార్యకర్తలు హైకోర్టుకి, ఆ తీర్పునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఆగ్రహించిన హైకోర్టు వీరందరి మీదా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను సీబీఐకి అప్పగించింది.విచారణ చేపట్టిన సీబీఐ వారిలో అందుబాటులో ఉన్నవారికి నోటీసులు ఇస్తోంది దీనిలో భాగంగానే ఆమంచికి కూడా నోటీసులు ఇచ్చారు.
సీబీఐకి ఆమంచి ఏం చెప్పారంటే !
దురుద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సిబిఐకి వివరించినట్లు చీరాల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.ఈ కేసు విషయమై శుక్రవారం ఆయన విశాఖపట్నంలోని సీబీఐ డీఎస్పీ శ్రీనివాసరావు ఎదుట హాజరయ్యారు.విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక పోలీసులు దర్యాఫ్తు చెయ్యదగ్గ డాక్టర్ సుధాకర్ లాంటి సాధారణ కేసును న్యాయస్థానం సీబీఐ విచారణకి అప్పగించటం తననేగాక ఆంధ్రప్రదేశ్ ని కూడా విస్తుపోయేలా చేసిందన్నారు.స్థానిక పోలీసులపై న్యాయస్థానానికి నమ్మకం లేకుంటే ఇంకెన్నో ప్రత్యామ్నాయాలు కోర్టుకు ఉన్నాయని ఇవేమీ కాకుండా సీబీఐకి ఇవ్వటం అసాధారణంగా కనిపించిందన్నారు.ఇదే విషయమై తాను చీరాలలో జరిగిన ఒక బహిరంగ సభలోనే మాట్లాడానని,భారత రాజ్యాంగం తనకు పందొమ్మిది వ అధికరణ౦ కింద ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉపయోగించుకుని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిందని సిబిఐ కి తెలియజేసినట్లు ఆమంచి తెలిపారు.ఇది కూడా మాజీ ఎమ్యెల్యే గానో ,ఒక పార్టీ నాయకునిగానో తాను చేయలేదని, భారత పౌరుడిగా మాత్రమే చేశానని సిబిఐ కి వివరించానన్నారు.పార్టీ పరంగా తననెవరూ ప్రేరేపించలేదని,కుట్ర పూరితంగా తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని సీబిఐకి చెప్పానన్నారు దీనికి సంబంధించిన నాలుగున్నర నిమిషాల వీడియోను సిబిఐకు అందజేశానన్నారు.ఈ కేసుకు సంబంధించి మొత్తం పదకొండు పాయింట్లను సిబిఐకి వివరించినట్లు ఆయన తెలిపారు.ఇదే అంశాలతో కూడిన అఫిడవిట్ ను గతంలోనే హైకోర్టుకి కూడా సమర్పించానన్నారు.ఒకవేళ తన ప్రసంగం రాజ్యాంగ పరిధిని అతిక్రమించినట్లు ఉన్నట్లయితే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తాను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమని గతంలో హైకోర్టుకు, ఇప్పుడు సీబీఐకి తెలియజేశానన్నారు. మీడియా సమావేశంలో న్యాయవాదులు కర్నేటి రవి,తులసీరామ్ కూడా పాల్గొన్నారు.