చీరాలలో శుక్రవారం రాజకీయ విచిత్రం చోటుచేసుకుంది. వైసీపీలోని వైరి వర్గాలు ఒకే చోట చేరినప్పటికీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం చీరాలలో శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమానికి చీరాల మాజీ శాసనసభ్యుడు , నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు.అలాగే ఆమంచికి వ్యతిరేకంగా ఉంటున్న వైసిపి నేతలు ఎమ్మెల్సీ పోతుల సునీత ,బీసీ కమిషన్ సభ్యుడు అవ్వారు ముసలయ్య,వైసిపి రాష్ట్ర కార్యదర్శి చీరాల మండల స్పెషల్ ఆఫీసర్ బేబి రాణి భర్త అయిన డాక్టర్ వరికూటి అమృతపాణి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ కార్యక్రమానికి వస్తారనుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ మాత్రం రాలేదు.నిజానికి ఆమంచి, కరణం వర్గాలు ఇప్పటి వరకు ఒక చోట సమావేశమైన దాఖలాలు లేవు.ఈ నెల రెండవ తేదీన జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను కూడా ఈ వర్గాలు విడివిడిగానే నిర్వహించాయి.ఈ సందర్భంగా కరణం వెంకటేష్ తన ప్రసంగంలో ఆమంచిని బెదిరించే ధోరణిలో మాట్లాట్టం వివాదస్పదమైంది .దీనిపై ఫిర్యాదులు కూడా పార్టీ అధిష్టాన వర్గానికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి ప్రభుత్వ కార్యక్రమానికి ఇరువర్గాలు వస్తుండటంతో అక్కడ ఏం జరుగుతుందోనని అందరూ ఆందోళన చెందారు.
పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.అయితే ఆమంచి కృష్ణమోహన్ హుందాగా వ్యవహరించి తనకు ప్రొటోకాల్ లేనందున వేదిక దిగువనే కూర్చున్నారు.ప్రోటోకాల్ ఉన్న పోతుల సునీత,ముసలయ్య తదితరులు వేదిక ఎక్కారు. ఆమంచి కృష్ణమోహన్ వర్గం పూర్తిగా సంయమనం పాటించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీడియో ప్రసంగం పూర్తికాగానే ఆమంచి కృష్ణమోహన్ ఆయన వర్గీయులు సభా ప్రాంగణం నుండి వచ్చే నిష్క్రమించారు.ఆ తరువాత జరిగిన కార్యక్రమాన్ని పోతులసునీత తదితరులు కొనసాగించారు.దీంతో ప్రభుత్వ అధికార కార్యక్రమం సజావుగా సాగిపోయింది.
పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్భంగా ఆమంచి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి పథకం ప్రారంభ సభలో అల్లర్లు చేసే నీచ రాజకీయం తాను చేయబోనన్నారు. తాను ఒక్క ముఖ్యమంత్రి జగను కి మాత్రమే జవాబు దారుడినని, మిగతా వారి రాజకీయాలను తాను పట్టించుకోబోనని ఆమంచి వ్యాఖ్యానించారు.ఏదేమైనా ఈ సభ లో ఏదో జరిగిపోతుందని ఊహించిన కొందరు ఏమీ జరగకకపోవడంతో నిరాశ చెందారు.