Amaravathi Farmers: అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూములను ఇచ్చిన సమయంలో ఏపీ సీఆర్డీఏతో రైతులు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం భూములను అభివృద్ధి చేసి ప్లాట్ లు, కమర్షియల్ స్థలాలు రైతులకు తిరిగి అప్పగించే విధంగా నాడు ఒప్పందం జరిగింది. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ఒప్పందం ప్రకారం రైతులకు ప్లాట్లను మూడేళ్లలోగా అభివృద్ది చేయాలన్న నిబంధన ఉంది. అయితే ఇప్పటి వరకూ రైతులకు ప్లాట్ లను అభివృద్ధి చేసి ఇవ్వలేదు.
Read More: AP CRDA: హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఆర్డీఏలో కదలిక..అమరావతి రైతులకు లేఖలు
Amaravathi Farmers: పరిహారం చెల్లించాలి
అభివృద్ధి చేయకపోవడంతో తాము జీవనోపాధి కోల్పోయామని రైతులు పేర్కొంటూ ఎకరానికి రూ.3లక్షల వంతున పరిహారం చెల్లించాలని సీఆర్డీఏ, ఏపి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ (రెరా)కు నోటీసులు ఇచ్చారు. రైతుల తరపున ఏపి రెరాకు హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. సీఆర్డీఏ ప్రాజెక్టు ఎందుకు తీసుకోలేదని ఏపి రెరాకు లీగల్ నోటీసులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం ప్లాట్లు ఇవ్వడంలో ఆలస్యం అయినందున రైతుల నివాస స్థలాలకు గజానికి నెలకు రూ.50లు, వాణిజ్య స్థలాలకు గజానికి రూ.75లు చొప్పున పరిహారం చెల్లించాలని ఈ నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెలాఖరులోగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదించి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేఖలు రాసిన తరుణంలోనే న్యాయవాది ద్వారా సీఆర్డీఏ, రెరాకు నోటీలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై సీఆర్డీఏ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.