(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం 59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాలలోనూ రైతులు, మహిళలు నిరసనలు తెలియచేస్తున్నారు. మరోవైపు వివాహ వేడుకల్లో, గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ జై అమరావతి నినాదాలు చేస్తున్నారు.మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు దీక్షా శిబిరాలలో, ధర్నాలో నినదిస్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమరావతి లోనే రాజధాని కొనసాగిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు వెల్లడిస్తున్నారు. సీపీఎం నేత బాబురావు విజయవాడలో పరిపాలనా వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షకు దిగారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నేడు మూడు రాజధానులను సమర్ధిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు.