అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. నిరసనలో భాగంగా శనివారం తుళ్లూరులో రైతులు మహాధర్నాలు నిర్వహించారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే దీక్షలు 32వ రోజుకు చేరాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో రైతు నిరసనలు కొనసాగుతున్నాయి.
మందడం, తుళ్లూరులో నిర్వహించిన మహాధర్నాలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 29 గ్రామాల రైతులు రోడ్లపై రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 32 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.