(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి:రాజధాని ఆందోళనలో పాల్గొన్న రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వెలగపూడి,మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన 16మంది రైతులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ఆందోళన అంశంపై మాట్లాడదామని రైతులను చిలకలూరిపేట పోలీసులు పిలిపించారు. పోలీసు స్టేషన్కు వెళ్లిన రైతులను అరెస్టు చేశారు. కారుమంచి ఫణీంద్ర, కారుమంచి అప్పయ్య, జొన్నలగడ్డ మనోజ్, బొర్రా వరప్రసాద్, లోక్య భూక్యానాయక్, నాయుడు వెంకటేశ్వరరావు, త్రిపురనేని శ్రీను, కారుమంచి పకీరయ్య, నాయుడు రామకృష్ణ, బోడేపూడి నాగరాజులను చిలకలూరిపేట పోలీసులు అరెస్టు చేయగా మరో ఆరుగురు రైతులను తెనాలి పోలీస్ స్టేషన్కు తరలించారు. గత నెల 29వ తేదీ ఏడుగురు రైతులను, ఈ నెల నాల్గవ తేదీన ఒక రైతును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.