(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో మరో ఇద్దరు గుండె పోటుతో మృతి చెందారు. మందడంలో సాంబమ్మ అనే మహిళ మృతి చెందింది. ప్రతి రోజు గ్రామంలో జరుగుతున్న మహాధర్నాలో సాంబమ్మ పాల్గొంటోంది. రాజధాని తరలిపోతుందన్న మనోవేదన కారణంగానే ఆమె ఆదివారం వేకువజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెలగపూడిలోనూ ఒక రైతు గుండె పోటుతో మృతి చెందారు. గ్రామానికి చెందిన అబ్బూరి అప్పారావు నిన్నటి వరకూ వెలగపూడిలో రాజధానికి మద్దతుగా జరుగుతున్న దీక్షలో పాల్గొన్నారు. శనివారం రాత్రి అకస్మాత్తుగా గుండె పోటుకు గురై మృతి చెందారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. 32 రోజుల నుండి గ్రామాల్లో ర్యాలీలు, ధర్నాలతో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.