రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో ప్రతిఏటా ఎడారి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ పండుగను నిర్వహించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల ఫిబ్రవరిలో 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ ఎడారి పండుగను జరుపుకోనున్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్, రాజస్థాన్ శాసనసభ సభ్యుడు రూపారామ్ మేఘ్వాల్ ఎడారి పండుగ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులు, నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు.
పూనమ్ సింగ్ స్టేడియంలో ప్రారంభం
44వ జైసల్మేర్ ఎడారి ఉత్సవం పూనమ్ సింగ్ స్టేడియంలో ఫిబ్రవరి 3వ తేదీన ఉత్సవ ఊరేగింపుగా ప్రారంభమవుతుంది. ఆస్ట్రో టూరిజం, బోర్డర్ టూరిజం వంటి సదుపాయాలు ఉంటాయి. సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో అనేక మంది యుద్ధవీరులు చరిత్ర, సాంస్కృతిక వారసత్వ కథలతో ఆ ఫెస్టివల్ను జరుపుకుంటారు.
పండుగలో ఆకర్షణలు
ఈ మూడు రోజుల పండుగలో అన్ని రకాల సంస్కృతి కార్యక్రమాలు, సంగీత కచేరీలు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు, ఇతర సంప్రదాయ వేడుకలను నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత విధ్వాంసులతో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వనున్నారు. సలీం సులేమాన్, అంకిత్ తివారీ, సల్మాన్ అలీ, షణ్ముఖ ప్రియ, రఘ దీక్షిత్ తదితర సింగర్స్ తో స్టేజీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇవి పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే జైసల్మేర్ ఎడారి ఫెస్టివల్కు సంబంధించిన క్లాసిక్ చిత్రాల ప్రదర్శన కూడా చేయనున్నారు. హెలికాప్టర్ రైడ్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. అలాగే రాజస్థాన్ వంటకాలు, ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు.
ఏడారి పండుగ చరిత్ర
జైసల్మేర్ ఎడారి పండుగ గురించి, పండుగ వెనకున్న చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. యాదవుల పాలకుడైన శ్రీకృష్ణుడు అర్జునుడితో యాదవ వర్గానికి చెందిన ఓ వారసుడు త్రికుట కొండపై తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పాడట. ఆ వాక్కు ప్రకారం.. 1196లో యాదవ వంశానికి చెందిన రావల్ జైస్వాల్ తన రాజ్యాన్ని జైసల్మేర్లో స్థాపించాడు. దాంతో అప్పటి నుంచి రాజ్యం మొత్తం సంబరాలు చేసుకోవడం ప్రారంభమైంది. ఆ సంబరాలే పండుగలా మారింది. దీంతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఎడారి పండుగను నిర్వహిస్తారు. ఈ డెసర్ట్ ఫెస్టివల్ భారతదేశంతోపాటు అంతర్జాతీయ సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అందుకే రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
ఎడారి పండుగ ముఖ్య ఉద్దేశం
జైసల్మేర్ ఎడారి ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం పర్యాటకులను ఆకర్షించడమే. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు, ప్రపంచవ్యాప్తంగా రాజస్థాన్ సామ్రాజ్య సంస్కృతిని విస్తరింపజేసేందుకు ఉద్దేశించబడింది. మూడు రోజుల పరిమిత కాల వ్యవధిలో నిర్వహించే ఈ పండుగ సందర్శకులకు జీవితకాలపు అనుభవాన్ని అందిస్తాయి. ప్రతి ఏడాది జైసల్మేర్ ఎడారి పండుగలో పెద్ద సంఖ్యలోనే సందర్శకుల తాకిడి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో భాగం అయ్యేందుకు విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తి కనబరుస్తారు.
సంగీత, నృత్య, వేషధారణలు
సంప్రదాయ రంగులను అద్దుకుని, ప్రపంచవ్యాప్తంగా అందరినికీ ఆకర్షించే అంశాలు, వారసత్వాన్ని జైసల్మేర్ ఎడారి పండుగ ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్ కళలు, నృత్యం, సంగీతంను ఎంతో నైపుణ్యం కలిగిన కళాకారులతో ప్రదర్శిస్తారు. ఫైర్, గెయిర్ నృత్యకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటితోపాటు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు పర్యాటకులు, సందర్శకులను అలరిస్తాయి.
ఈ ఏడాది ప్రత్యేకంగా ఉండనుంది: ఎమ్మెల్యే
జైసల్మేర్ ఎడారి పండుగ ఈ ఏడాది ప్రత్యేకంగా ఉండనుందని రాజస్థాన్ ఎమ్మెల్యే రూపారామ్ మేఘ్వాల్ అన్నారు. జైసల్మేర్ వారసత్వ కట్టడాలు, సంప్రదాయలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. రాజస్థాన్ సాంప్రదాయ మూలాలను వివిధ రూపాల్లో చూసేందుకు వీలుంటుందన్నారు. రాజస్థాన్ కళాత్మక భాగాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రదర్శిస్తామన్నారు. రాత్రి వేళల్లో ఏడారి ప్రాంతంలో సౌండ్ అంట్ లైట్ షోలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేడుకలు ఘనంగా జరుగుతాయి.
జైసల్మేర్కు ఎలా వెళ్లాలి?
రోడ్డు మార్గం: జైసల్మేర్ రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడింది. ఈ నగరానికి రాకపోకలు చేయడం చాలా ఈజీ. రాజస్థాన్ నుంచి రాష్ట్ర రవాణా బస్సులు, స్లీపర్, ఏసీ బస్సులు, క్యాబులు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. వీటితో సులభంగా జైసల్మేర్ ఏడారి ఫెస్టివల్ జరిగే చోటుకు చేరుకోవచ్చు.
రైలు మార్గం: భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల నుంచి జైసల్మేర్ వెళ్లేందుకు రైలు మార్గం ఉంది. ఈ ఏడారి నగరానికి మధ్యలో రైల్వే స్టేషన్ ఉంది. జైసల్మేర్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటోలు, రిక్షాలు, ప్రైవేట్ వాహనాలతో ఫెస్టివల్ జరిగే ప్రాంతానికి చేరుకోవచ్చు.
వాయు మార్గం: జైసల్మేర్కు దగ్గరలో ఉంటే అంతర్జాతీయ విమానాశ్రయం జోధ్పూర్. ఇది జైసల్మేర్కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీల ద్వారా జైసల్మేర్కు చేరుకోవచ్చు.