Ambati Rambabu: రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై వైసిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త బాణాన్ని సంధించారు.మాటకారిగా పేరున్న సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబును జగన్ తన అంబులపొదిలో నుండి బయటకు తీశారు.ఆర్ ఆర్ ఆర్ కు కౌంటర్లు ఇస్తుండడమే ఇక నుండి అంబటి రాంబాబు డ్యూటీ అని వైసిపి వర్గాలు చెప్తున్నాయి.బాస్ ఆదేశాల మేరకు అంబటి రాంబాబు బరిలోకి దిగేశారు.రఘురామరాజు రియల్ ఫేస్ అంటూ మొదటి ట్వీట్ కూడా వదిలారు.
బిగ్గెస్ట్ స్కామ్ స్టర్ ఎంపీ!
అందులో పోస్ట్ చేసిన వీడియోలో రఘురామ రాజు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవటంతో నమోదైన కేసుల వివరాలతో వచ్చిన పత్రికల క్లిప్పింగ్ లను అంబటి చూపించారు. లోక్ సభ సభ్యుల లోబిగ్గెస్ట్ స్కామ్ స్టర్ అన్న బిరుదును కూడా అంబటి ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇచ్చారు. దీనిని అంబటి రాంబాబు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ.. నిర్మలా సీతారామన్..రవి శంకర్ ప్రసాద్..డాక్టర్ జయశంకర్ లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, అదే విధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ట్యాగ్ చేసారు. చివరగా ఆ ట్వీట్ లో… “ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరైనా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తారు కానీ, అదే సీటు ను పట్టుకొని వేలాడరు..సిగ్గు లేని ఎంపీ స్కామ్ స్టర్ “అంటూ అంబటి ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆర్ ఆర్ ఆర్ ఎత్తుగడలనే అనుసరిస్తున్న వైసీపీ
కాగా ఇదంతా చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షి అన్నట్లుగా వైసిపి కౌంటర్ ఉంది.అంతకుముందు రచ్చబండ ద్వారా జగన్ ప్రభుత్వంపై విమర్శలతో రచ్చ చేసిన రఘురామకృష్ణంరాజు.. మొన్న అరెస్టు తర్వాత కొత్త ప్రచార వ్యూహాన్ని ఎన్నుకున్నారు.ఇందులో భాగంగా ఆయన ఎంపీలకులేఖ రాయటం,జాతీయపార్టీల నాయకులకు ట్వీట్ల ద్వారా తన మొర చెప్పుకోవటం వంటివి చేస్తున్నారు.మొన్నటి వరకు రఘురామ కృష్ణంరాజును పెద్దగా పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో కూడా తనను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్న ఎంపీపై ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.అందుకే అంబటి రాంబాబు ద్వారా ఆర్ఆర్ఆర్ మీద మొదటి బాణం వేయించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఆసక్తికర పరిణామాలు సంభవించే సూచనలు గోచరిస్తున్నాయి.