అదేమి చిత్రమో గాని రాష్ట్రంలో ఎక్కడ భూకబ్జాలు జరిగినా ఆ ప్రాంత వైసిపి ప్రజాప్రతినిధుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి!
వైసీపీ అగ్ర నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు విశాఖ ప్రాంతంలో జరిగిన భూ దందాలలో మారుమ్రోగింది! ఆయన కోసమే భూదందాలు చేస్తున్నట్లుగా ఈ కేసులలో పట్టుబడిన కొందరు నేతలు చెప్పటం సంచలనం రేపింది. దీంతో విసిగిపోయిన విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ఎవరు భూదందాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ,తన పేరు వాడుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు అంతేకాకుండా తన పేరు చెప్పుకునే భూ కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజయసాయి రెడ్డి విశాఖ పోలీస్ కమిషనర్ కు లేఖ సైతం రాయాల్సి వచ్చింది.
ఇలా సాగుతుండగానే గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ శాసన సభ్యుడు అంబటి రాంబాబు వంతు వచ్చింది. అసలే ఇటీవల ఆయన ఒక అక్రమ క్వారీయింగ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆ బురద కడుక్కోకముందే మరో నింద వచ్చి అంబటి రాంబాబు మీద పడింది.వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేరుతో తనకు బెదిరింపులు వస్తున్నాయని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమప్రసాద్ ఆరోపణలు చేసారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి తనను ఫోన్ లో అంబటి రాంబాబు పేరుతో బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఫోన్ సంభాషణను అందించినట్టు తెలిపారు. అర్ధరాత్రి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నీ సంగతి తేలుస్తామని… ముక్కలుగా నరుకుతామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మీడియా కిచెప్పారు.
నరసరావుపేటరోడ్డులో తనకు 11 సెంట్ల భూమి ఉందని దానిని కబ్జా చేసేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ విషయాన్ని వెల్లడించారు. దీనితో శ్రీనివాసరెడ్డి తనకు అర్ధరాత్రి అంబటి రాంబాబు పేరుతో ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టినందుకు అంతు చూస్తానని బెదిరించాడని రోడ్డు దగ్గరకు వస్తే ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించాడని ఆరోపించారు.
ఈ విషయంలో అంబటి రాంబాబు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలన్నారు. అసలు శ్రీనివాసరెడ్డితో సంబంధం ఉందో లేదో కూడా రాంబాబు వెల్లడించాలని కోరారు.
సంబంధం లేని పక్షంలో శ్రీనివాస్ రెడ్డిని పోలీసులకు పట్టించాలని రాంబాబుకు బాధితుడు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మరీ కొత్త వివాదం నుండి అంబటి రాంబాబు ఎలా బయటపడతారో వేచి చూడాలి!