ఏపీ హైకోర్టు సాక్షిగా ఇరుకున పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఈ దఫా విపక్షాల నుంచో వివిధ వర్గాల నుంచో కాకుండా సొంత పార్టీ నుంచే సమస్య ముందుకు వచ్చింది.
అందులో ముఖ్యమైన నేత ఇరకాటంలో పడిన పరిస్థితి. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఇబ్బందుల పాలవడం ఖాయమని అంటున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
అంబటి నిజంగా ఇలా చేశారా?
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై కీలక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు చేశారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్లో ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి చేరినా…
రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. అక్రమ మైనింగ్ విషయంలో ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే, వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన భాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగరఘు వెల్లడించారు. అక్రమ మైనింగ్ విషయంలో విచారణ జరపాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినా పట్టించుకోలేదని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా, అక్రమ మైనింగ్పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ వచ్చే నెలకు హైకోర్టు వాయిదా వేసింది.
అంబటి బుక్కయినట్లేనా?
కాగా, అక్రమ మైనింగ్ ఆరోపణలు ఓ వైపు, ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉదంతం మరోవైపు ఉండటంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇరుకున పడినట్లేనా? అనే చర్చ తెరమీదకు వస్తోంది. వైఎస్ఆర్సీపీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకొని బలంగా మాట్లాడే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే హైకోర్టును ఆశ్రయించడంతో విపక్షాలు, అంబటి అంటే గిట్టని వారు ఆయన్ను సులవుగా టార్గెట్ చేయవచ్చని అంటున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శల పరంపర తప్పదని విశ్లేషిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉదంతం ఖచ్చితంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ వంటిదని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?