అయిదు వారాలుగా మూతబడ్డ అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు ట్రంప్ దిగిరావడంతో మళ్లీ పనిలోకి దిగింది. అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు అద్యక్షుడితో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. అనంతరం డొనాల్డ్ ట్రంప్ సంతకం పెట్టడంతో అది చట్టంగా మారింది.
డెమోక్రాట్ పార్టీ సీనియర్ సెనేటర్ చక్ షూమర్, ట్రంప్ గుణపాఠం నేర్చుకున్నారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ట్రంప్ తాత్కాలికంగానే తగ్గినట్లు కనబడుతోంది. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు 570 కోట్ల డాలర్లు కావాలన్న ట్రంప్ డిమాండ్కు కాంగ్రెస్ తలొగ్గక పోవడంతో ఆయన ప్రభుత్వాన్ని మూతపెట్టారు.
‘కాస్సేపట్లో ప్రభుత్వాన్ని తిరిగి తెరిచేందుకు బిల్లుపై సంతకం చేస్తాను. రానున్న 21 రోజుల్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నమ్మకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. అలా కాకపోతే మళ్లీ మూత తప్పదు. లేదా నాకున్న అధికారాలను ఉపయోగించి ఎమర్జెన్సీ ప్రకటిస్తాను’, అని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రభుత్వం మూత కారణంగా అయిదు వారాలుగా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా పని చేస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వ కేంద్రాలలో పనిచేసే అటెండర్ల నుంచి కోస్ట్ గార్డ్ నావికులు, వైట్హౌస్ భద్రతను చూసే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వరకూ ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు జీతాలు లేకుండా పని చేస్తున్నారు.
చివరికి విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బంది చాలామంది విధులకు హాజరు కాక పోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవడంతో ట్రంప్పై వత్తిడి పెరిగింది.