(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడితే కొంత కాలం విధులకు దూరంగా ఉంటారు. పోలీసులు లంచం తీసుకుంటే కొంత కాలం విఆర్లో ఉంటారు లేదా సస్పెండ్ అవుతారు. అవినీతి అంటే ముందు అధికారులు మాత్రమే గుర్తు వస్తుంటారు. కానీ రాజకీయ అవినీతి గురించి ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేరారోపణలు, క్రిమినల్ చరిత్ర, అవినీతి ఆరోపణలు ఉన్న ఏంతో మంది ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా మన దేశంలో చెలమణి అవుతున్నారు. వాళ్ళకు అడ్డుకట్టవేసే విధంగా ఓ కీలక దస్త్రం సుప్రీం కోర్టులో తయారు అవుతోంది. కేంద్రం, సుప్రీం కోర్టు అన్ని కలిపి ఈ కీలక దస్త్రాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇది పక్కాగా అనుకున్నది అమలు అయినట్లు అయితే నేరారోపణ, నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిలు, ప్రజా ప్రతినిధుల కేసులు సత్వరం పరిష్కరించేలా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలనేది దీని ప్రధాన ఉద్దేశం.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాది లోపు పూర్తి చేయాలన్న పిటిషన్పై విచారణ చేపట్టింది. కోర్టుకు సహాయంగా అందించేందుకు నియమించబడిన అమికస్ క్యూరీ అన్సారీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులకు సంబంధించి 4,400లకు పైగా కేసుల పెండింగ్లో ఉన్నాయని సుప్రీం కోర్టుకు నివేదించగా తాజాగా మరో సప్లమెంటరీ నివేదికను నేటి విచారణలో అందజేశారు. కేసుల సత్వర విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అమికస్ క్యూరీ న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పలు రాష్ట్రాల్లో రెండు, మూడు కేసులే ఉన్న సందర్భంలో అలాంటి వాటికి గానూ రాష్ట్ర హైకోర్టులకు కొన్ని ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడి నమోదు చేసి పలు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ విచారణ ఇంక ప్రారభం కాలేదని అమికస్ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకువస్తూ వాటి విచారణకు ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ధర్మాసనం ఎలంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామనీ, కేసుల సత్వర విచారణకు తాము సిద్ధమేననీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొంటూ ప్రత్యేక కోర్టులు, మౌళిక వసతుల కల్పనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరారు. అమికస్ క్యూరీ, సోలిసిటర్ జనరల్ సూచనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టు..ట్రయల్ కోర్టులకు రేపటి లోగా పలు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నది. కాగా ప్రజా ప్రతినిధులు దోషిగా తేలితే వారు జీవిత కాలం ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయాలని పిటిషనర్ అయిన బిజెపి నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ధర్మాసనాన్ని కోరగా ఈ అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొన్నది.