కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలందరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. 10 వేలకు తక్కువ కాకుండా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో కూడా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే ఈ వైరస్ ఇంకా తీవ్ర రూపం దాల్చి ఉండగానే విశాఖలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ గురించి ఏజెన్సీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ కు కూడా జ్వరం ప్రాధమిక లక్షణం కావడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ అనే వైరస్ విస్తరిస్తున్నట్లు గుర్తించారు. మురుగు నీరు ఎక్కువగా నిల్వ ఉన్న చోట, పచ్చిక ఎక్కువగా ఉన్న చోట ఈ వైరస్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ వైరస్ సోకితే ముందుగా శరీరంమీద దద్దుర్లు వస్తున్నాయి. ఆ తర్వాత జ్వరం వస్తుంది. ఒకవేళ ఈ వైరస్ ను గుర్తించడం ఆలస్యమైతే అది గుండె, కాలేయం తదితర భాగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కాకపోతే ఇది కరోనా అంతటి తీవ్రమైనది కాదు. ఒకరి నుండి మరొకరికి సోకదు కూడా.
ఇటీవలే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ వైరస్ సోకి ముగ్గురు చనిపోయారు. వారికి కరోనా టెస్టులు చేస్తే నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత మలేరియా, డెంగ్యూ టెస్టులు చేసినా కూడా నెగటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొందరు నిపుణులు పరీక్షించగా అది స్క్రబ్ టైఫస్ అనే వైరస్ అని తేలింది. ముందుగా ఈ వైరస్ ను గుర్తించగలిగితే యాంటీ బయోటిక్ ఇంజక్షన్తో నయమైపోతుందని, అదే కనుక ఆలస్యమైతే మాత్రం దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని చెబుతున్నారు.