Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల మండలి సమావేశం తూతూమంత్రంగా ముగిసింది.ఈ సమావేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆశించినవారందరికీ నిరాశే మిగిలింది.
ఈ సమావేశంలో పాల్గొన్న దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు అనేక సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఆయన ఊ కొట్టడం తప్ప వేటికి పరిష్కార మార్గం చూపలేదు.ఇంకా చెప్పాలంటే అమిత్ షా తాను ఢిల్లీ నుండి తనతో తీసుకొచ్చిన అజెండాను దక్షిణాది రాష్ర్టాలకు నూరిపోశారు.ఏ ఒక్క అంశానికీ అమిత్ షా నుండి హామీ లభించకపోవడంతో దక్షిణాది రాష్ర్టాలు నిరాశ చెందాయి
అసలేం జరిగిందంటే?
ఈ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులతో సహా ఇతర రాష్ర్టాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఆతిథ్యమిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాగా ఓ గంటపాటు పరిచయాలకు ,చిరు సన్మానాలకే సరిపోయింది.నాలుగు గంటలకు అసలు సమావేశం ప్రారంభం కాగా ఆరునలభై అయిదు గంటల వరకు సాగింది.ఒక్కో రాష్ట్ర ప్రతినిధికి పది నుండి పదిహేను నిమిషాల సేపు మాట్లాడే సమయం మాత్రం లభించింది.అయితే ఈ సమయాన్ని జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకుని తను చెప్పాల్సింది చెప్పేశారు. వారు చెప్పినదంతా కేంద్ర హోంమంత్రి విన్నారని అనుకోవాలి.ఇక అమిత్ షా ప్రారంభోపన్యాసం చేశారు.రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడాక ఆయన సమాధానం ఇవ్వడానికి ఉపక్రమించారు
Amit Shah: కేంద్ర హోం మంత్రి గారి ఉచిత సలహా!
తాము లేవనెత్తిన అంశాలను, ఆయన దృష్టికి తెచ్చిన సమస్యలను అమిత్ షా పరిగణనలోకి తీసుకుని ఏదో ఒక పరిష్కార మార్గం చూపుతారని దక్షిణాది రాష్ర్టాల ప్రతినిధులు ఆశించారు.అయితే ఆయన సింపుల్ గా ఈ సమస్యలను రాష్ర్టాలే అంతర్గతంగా పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని తేల్చేశారు.నిజానికి ఈ కౌన్సిల్ సమావేశాలు కేవలం లాంఛన ప్రాయమేనని,వీటికి ఎటువంటి అధికార ముద్ర ఉండదని అమిత్ షా అసలు విషయం బయటపెట్టారు.అంతటితో ఆగకుండా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఐపీసీకి చేయతలపెట్టిన సవరణలు,ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫోరెన్సిక్ కళాశాల,డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితర విషయాలను దక్షిణాది రాష్ర్టాలకు వివరించి సమావేశాన్ని ముగించారు.దీంతో ఉసూరుమంటూ దక్షిణాది రాష్ర్టాల ప్రతినిధులు తిరుగుముఖం పట్టారు.