టాలివుడ్ అగ్రనటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. నేటి మునుగోడు సభ తర్వాత అమిత్ షా రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. అక్కడ అమిత్ షా తో తారక్ భేటీ అవుతారు. ఇటీవలే త్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్) మువీ తిలకించిన అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్ నటనను మెచ్చి ఆహ్వానించినట్లు సమాచారం. షా ఆహ్వానం మేరకు తారక్ కలవడానికి వెళుతున్నారని చెబుతున్నారు. దాదాపు 15 నిమిషాల సేపు అమిత్ షాతో సమావేశమవుతారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ నేపథ్యం కూడా ఉండటం వల్ల అమిత్ షాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ల భేటీ అంశం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా తారక్ .. 2009 ఎన్నికలకు ముందు టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి, ప్రసంగానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆ తరువాత తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. టీ డీ పీ మహానాడుకు చాలా కాలంగా హజరుకావడం లేదు. అయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్దం చేసుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జూనియర్ తో భేటీకి అమిత్ షా ఆహ్వానం రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేటి బేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందా లేక అభినందన భేటీయా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
దక్షిణాది రాజకీయాలపై ఫోకస్ పెంచిన బీజేపీ .. రజనీకాంత్ కు బిగ్ ఆఫర్..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?