మునుగోడు బహిరంగ సభ కోసం తెలంగాణకు విచ్చేసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తో ఫిలిమ్ సిటీలోని ఆయన నివాసంలో, నోవాటెల్ హోటల్ లో ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లతో భేటీ అయ్యారు. తెలంగాణ పర్యటనలో ఈ ఇద్దరు ప్రముఖులతో అమిత్ షా భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ట్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్) మువీ తిలకించిన అమిత్ షా.. ఆయన అధ్భుత నటనను ప్రశంసించేందుకే కలిశారని వార్తలు వచ్చాయి. అయితే అమిత్ షా పక్కన కిషన్ రెడ్డి తదితర బీజేపీ ముఖ్య నేతలు ఉన్నప్పటికీ .. రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ లతో అమిత్ షా ఏకాంతంగా మాట్లాడారు. వారి సంభాషణల్లో రాజకీయ పరమైన అంశాలు వచ్చాయా లేదా అనేది బయటకు తెలియరాలేదు. ఇరువురు ప్రముఖులతోనూ దాదాపు 20 నిమిషాల పాటు సమావేశం అయ్యారు అమిత్ షా. వీరితో భేటీ అనంతరం అమిత్ షా తెలుగులో వీరిని ప్రశంసిస్తూ ట్వీట్ లు చేశారు.
తెలుగు సినిమా తారకరత్నం
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించిందని అన్నారు. మరో ట్వీట్ లో..”శ్రీ రామోజీ రావు గారి జీవిత ప్రయాణం అపురూపమైనది వారు చలనచిత్ర పరిశ్రమకు, మీడియాకు సంబంధించిన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. ఆయనను హైదరాబాద్లోని తన నివాసంలో కలిశాను” అని పేర్కొన్నారు.