(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయం ఏపిలోని విశాఖపట్నం- నర్సాపురం మధ్య కాకినాడకు ఎగువన తీరాన్ని తాకింది. గంటకు 22 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం కొద్దిసేపటి క్రితం తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 55 నుండి 75 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరం దాటిన తరువాత తీవ్ర వాయుగుండం నుండి వాయుగుండంగా మారి ఆ తర్వాత అప్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ మరఠ్వాడా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపి విపత్తుల శాఖ సూచనల మేరకు రెవెన్యూ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాలలో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.
మరో పక్క శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,47,032 క్యూసెక్కులు వస్తుండగా ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు 2,22,850 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులు ఉంది.