పార్టీలో ఉండమని, అధినేతను కాదని సైకిల్ దిగిపోయారు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం! వీరు అధికారికంగా సైకిల్ దిగారా లేక పార్టీనే వీరిని సస్పెండ్ చేసిందా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదన్నట్లుగా ఉంది వ్యవహారం. తనను పార్టీ సస్పెండ్ చేసిందో లేదో చంద్రబాబునే అడగండి అంటాడు వంశీ… తనను పార్టీ సస్పెండ్ చేసింది అంటున్నాడు గిరి… కరణం మాత్రం ఇంకా స్పందించలేదు! ఈ పరిస్థితుల్లో సైకిల్ దిగడానికి, అసెంబ్లీలో వేరు కుంపటి పెట్టుకుని కూర్చోడానికి ఉన్న ధైర్యం ఆ ఒక్క విషయంలోనూ ఎందుకు పోయిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది!
పార్టీని వీడే ధైర్యం ఉంది.. అధినేతను ఎదురించిన తెగింపు ఉంది.. వంశీలాంటి వారైతే ఏకంగా విజయసాయిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైకాపా ఎమ్మెల్యేల మీటింగులకు కూడా జారయ్యేటంత తెగువా ఉంది! ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల విషయంలో.. వైకాపా తరుపున ఓటువేసే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న! పార్టీ తనను సస్పెండ్ చేసింది అని చెబుతున్న మద్దాలగిరి… స్వేఛ్చగా వైకాపాకు ఓటు వేసుకోవచ్చు కదా! తనను సస్పెండ్ చేశారో లేదో చంద్రబాబునే అడగండయ్యా అని చెబుతున్న వంశీ… వైకాపాకు మద్దతివ్వొచ్చుగా! తన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుతో సహా ఏ టీడీపీ ఎమ్మెల్యేకీ లేదని చెబుతున్న బలరాం… 152 ని 155 చెయ్యొచ్చుగా! ఆ ధైర్యం వారు ఎందుకు చేయలేదు?
ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికలకు ఓటు హక్కు ఎల వినియోగించుకోవాలో, ఓటు ఎలా వేయాలో తెలియదు అని చెబితే నమ్మే పరిస్థితిలో జనం లేరు కాబట్టి… వారు కావాలనే తమ ఓట్లు చెల్లుబాటు కాకుండా ఉండేలా ఓటు వేశారు. అది ఓపెన్ సీక్రెట్!! ఎందుకు అలా చేశారు… బాబు అంటే భయమా, రాజ్యంగం అంటే గౌరవమా, లేక జగన్ నుంచి ఇంకా బలమైన భరోసా రాలేదా? రాపాకకున్న ధైర్యం వీరికి ఎందుకు లేదు? తనను తాను రెబల్ గా ప్రకటించుకుందీ లేదు.. అతనిపై పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుందీ లేదు.. విప్ జారీ చేసిందీ లేదు.. రాపాక తాను అనుకున్నది తాను ధైర్యంగా చేసిపారేశారు. 151 ని 152 చేశారు. మరి మిగిలిన ముగ్గురూ ఏమి చేశారు? ఇలా ఎందుకు చేశారు? సమాధానం దొరికితే బాగుండును కదా అని పలువురు ఆశిస్తున్నారు.. ఆశగా చూస్తున్నారు!