జగన్ని తాను వైఎస్ కొడుకుగానే ఇష్టపడతాను తప్ప సీఎం గా ఆయన్ని వదిలిపెట్టనని, తనకు చంద్రబాబు ఎలాగో జగన్ కూడా అంతేనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ఏడాది జగన్ పాలన మీద మాజీ ఎంపీ, వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడుగా ముద్ర వేసుకున్న ఉండవల్లి తనదైన శైలిలో నిప్పులే చెరిగారు.
అందులో అధిక శాతం టీడీపీ ప్రతీ రోజూ వల్లె వేస్తున్నవే.కానీ తాను రాజకీయ తటస్థుడిని అనిపించుకోవడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని, అందుకే జగన్ని ఘాటుగా విమర్శిస్తూ మార్కులు కొట్టేయాలని చూశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఉండవల్లి టీడీపీకి ఆనందం కలిగించారు.ఉండవల్లి తాజాగా చేసిన విమర్శలు అన్నీ టీడీపీ అనుకూల మీడియాలో బాగా హైలెట్ కావడం కూడా ఇక్కడ గమనార్హం.ఆయితే వైసిపి ఉండవల్లి వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తోంది..ఉండవల్లి హఠాత్తుగా జగన్ కి నీతులు చెబుతున్నారు. పాలకుడు అన్న వాడు ప్రజల పక్షం ఉండాలి తప్ప రాజకీయ ప్రత్యర్ధుల మీద పగలూ, ప్రతీకారాలు ఉండరాదని నెల్సన్ మండెలా ఉదంతాన్ని ఉదహరించారు.
ఇదంతా బాగానే ఉంది అనుకున్నా నాడు అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రత్యర్ధి వైసీపీని టిడిపి చీల్చి చెండాడినపుడు ఇదే మాటలు బాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు చెప్పలేకపోయారని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి .ఇక తన పధకాలు, విధానాలకు, కార్యక్రమాలకు అడుగడుగునా బ్రేకులు వేస్తున్న తెలుగుదేశం పార్టీని సీఎం టార్గెట్ చేయకుండా ఎలా ఉండగలరు, ఆయన ప్రజలకు మేలు చేద్దామనుకుని తెచ్చిన పధకాలు కాకుండా చేస్తూంటే మరి యుధ్ధమే చేయాలి కదా. అది కూడా ప్రజల కోసమే కదా అన్న మాట వైసీపీ వైపు ఉంచి వస్తోంది. ఇక జగన్ ఏలుబడిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గత ఏడాదిలో జరిగాయి. వాటి గురించి టీడీపీ ఎటూ చెప్పదు, కనీసం రాజకీయ పరిశీలకుడిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కి కూడా అవి కనబడలేదా అని వారు అడుగుతున్నారు
రాజకీయాల్లో అవినీతి వద్దు అని జగన్ అంటూ వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చాక పోలవరం లో రివర్స్ టెండరింగ్ కి వెళ్ళి వందల కోట్ల ఆదాయం మిగిలిచారు. అలాగే అనేక కీలక శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. మరి అవినీతి పునాదులు పెకిలించే పనిని జగన్ చేయవద్దు అని ఉండవల్లి చెప్పదలచారా అన్న ప్రశ్న కూడా ఇపుడు వస్తోంది. అప్పు చేసి పప్పుకూడు అంటూ జగన్ బడ్జెట్ ని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు, అయిదేళ్ళలో రెండున్నర లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేసిన టీడీపీ హాయాం గురించి ఉండవల్లి ఒక్క మాట అనడంలేదేమని కూడా వైసీపీ నుంచే ప్రశ్న వస్తోంది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి పెద్దరికంతో హుందాతనంతో ఏవైనా సలహాలు ఇవ్వాల్సిందిపోయి టిడిపికి అస్త్రాలు ఇచ్చే స్థాయిలో జగన్ ప్రభుత్వంపై బాణాలు సంధించడం ఏమీ బాగోలేదని వైసీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి