భర్త, పిల్లలే సర్వస్వం అనుకునే మహిళలకు జీవితం అంతా వారితోనే గడచిపోతుంది. వారి త్యాగాలకు ఎంత చేసినా తక్కువే. అలా కన్నతల్లి చేసిన సేవలను గుర్తించి ఆమె రుణం తీర్చుకోవాలని తపించాడో కొడుకు. ఆమెకు దేశమంతా చూపించాలనుకున్నాడు. ‘మాతృ సేవా సంకల్ప యాత్ర’ పేరుతో తన తండ్రి 20 ఏళ్ల క్రితం కొనిచ్చిన స్కూటర్ పై 70 ఏళ్ల వయసున్న తల్లిని కూర్చోపెట్టుకుని యాత్ర మొదలుపెట్టాడు. ఏకంగా 56,552 కిమీ ప్రయాణించి పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన ప్రదేశాలు చూపించాడు. అతని పేరు కృష్ణ కుమార్. మైసూర్ వాసి. ఈ విషయం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు తెలిసి చలించిపోయాడు. దీంతో ఆయనతీసుకున్న నిర్ణయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
తల్లి కోసం కారు గిఫ్ట్ ఇస్తూ..
ఆ తల్లిపై కొడుకు చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయిన మహీంద్రా ఏకంగా కారు బహుమతిగా ఇచ్చాడు. ‘కన్నతల్లి కోసం కొడుకు చేస్తున్న పని నాకు అమితానందం కలిగించింది. ఆ తల్లి కోసం నేను కారు గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇకపై వారు కారులో ప్రయాణిస్తారు’ అని గత అక్టోబర్ లో ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ట్విట్టర్లో వీరి వీడియోను కూడా షేర్ చేశారు. ఆరోజు మహీంద్రా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. ఈ శుక్రవారం వారికి మహీంద్రా కేయూవీ 100 నెక్స్ట్ కారును అందజేశారు. ఈ కారును ప్రయాణాల కోసమే కాకుండా సామాజిక సేవకు కూడా ఉపయోగిస్తానంటున్నాడు. కృష్ణకుమార్ అభినందనీయుడు అంటూ మరో మెసేజ్ కూడా చేశారు.
కారు చూసి మా అమ్మ చిన్నపిల్ల అయిపోయింది..
మహీంద్రా నుంచి కారు అందుకున్న కృష్ణకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇదొక అపురూపమైన బహుమతి. మా అమ్మ చూడారత్న ఇప్పటికీ నమ్మలేకపోతోంది. కారులో కూర్చుని చిన్న పిల్లలా మురిసిపోతూ విశేషాలను అడిగి తెలుసుకుంటోంది. కారులోనే ఆమెను చాముండేశ్వరి ఆలయానికి తీసుకెళ్లాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం చేయడం లేదు. పరిస్థితులు అనుకూలించాక మళ్లీ ప్రయాణిస్తాం. కారు వచ్చినా స్కూటర్ ను అలానే ఉంచుకుంటాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఆధ్యాత్మిక భావాలకు గురయ్యాను. తన ఇంటిని ‘జ్ఞాన వికాస కేంద్రం’గా మార్చి అందులో యాత్ర వివరాలు ఉంచుతాను. నేటి యువతకు నా అనుభవాలను వివరిస్తాను’ అంటున్నాడు కృష్ణకుమార్.