ఏపీ ఎంపీ ఒకరు బెదిరించడంతో హైదరాబాదులోని ఒక బక్క జీవి గుండె ఆగిపోయింది అన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
తన అనుచరుడు ఒకరు ఒక అమాయకుని భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే అతడికి సదరు ఎంపీ మద్దతివ్వడమే కాకుండా ఆ భూ యజమానిని తీవ్రంగా బెదిరించడంతో ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఈ విషాదం హైదరాబాద్ లోని ఓల్డ్ బోయినపల్లిలో చోటుచేసుకుంది. అక్కడి మణికంఠ కాలనీ లో గణేష్ అనే వ్యక్తి తన కష్టార్జితంతో ఒక విలువైన భూమిని కొనుక్కున్నాడు. అందులో అందమైన ఇల్లు కట్టాలని కలలుకన్నాడు.కానీ పక్కింటిలో ఉండే రమేశ్ అనే వ్యక్తి కన్ను ఆ స్థలంపై పడింది. గణేష్ ను ఇల్లు కట్టుకోనీయకుండా అడ్డుపడ్డాడు.అష్టకష్టాలు పడి గణేష్ ఇల్లు కట్టుకున్నా జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఇంటిని కూలగొట్టించాడు.
గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సివిల్ కేసు అని పట్టించుకోలేదు.మరి రమేష్ కున్న రాజకీయ పలుకుబడి అంతా అంతా ఇంత కాదు కదా!పోలీసులు కూడా తప్పుకున్నారు!అంతటితో వదలకుండా గణేష్ మీద రమేష్ కోర్టు లో కేసు పెట్టాడు.ఆ భూమి తనదంటూ వాదించాడు.ఈ నరకయాతన పడలేక గణేష్ తన స్థలాన్ని రమేశ్ కే విక్రయిస్తానన్నాడు. రూ.20లక్షలు అడ్వాన్సుగా రమేశ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొనడం ఇష్టం లేదని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గణేష్ ఆ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశాడు కూడా. అయినా రమేశ్ వేధింపులు ఆగలేదు.ఆ భూమి తనకి ఇవ్వాల్సిందేనంటూ గణేషుని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాల ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు.
అంతేగాక తన రాజకీయ గురువైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎంపీతో కూడా గణేష్ కి వార్నింగు ఇప్పించారు. రమేష్ కి ఆ భూమిని ఇచేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఆ ఎంపీ బెదిరించినట్లు భోగట్టా! దీంతో గణేష్ బెదిరిపోయాడు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.నిద్రాహారాలు మానేసాడు. అనారోగ్యం పాలయ్యాడు.చివరకు గణేష్ ఆదివారం గుండెపోటుతో మరణించాడు.దీంతో గణేష్ కుటుంబీకులు బంధువుల గుండెలు మండిపోయాయి. గణేష్ మృతదేహంతో అతడి బంధువులు రమేశ్ ఇంటి ముందు బైఠాయించారు.రమేష్ ఇంటిని తగలబెట్టడానికి కూడా వారు ప్రయత్నించారు. దీనితో రమేశ్ కుటుంబ సభ్యులు పరారయ్యారు.
తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే బైఠాయిస్తామని వారు భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.కేసు విచారణ చేపట్టారు. కాగా ఈ ఇంటి స్థలం విషయంలో ఆ ఇద్దరి మధ్య గొడవ నడుస్తోందని స్థానిక కార్పొరేటర్ నరసింహ యాదవ్ ధ్రువీకరించారు ఒకసారి సెటిల్మెంట్ కోసం తన వద్దకు వచ్చారని కూడా ఆయన వెల్లడించారు.తాను తగిన సలహాలిచ్చి పంపానని ఆ తరువాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.అయితే హైదరాబాద్లోని భూమి విషయంలో ఆంధ్రా ఎంపీ జోక్యం చేసుకోవటం తన అనుచరునికి మద్దతుగా బెదిరింపులకు దిగడం , ఒక యువకుని ప్రాణాలకు మరణానికి కారణం అవ్వటం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసుల దృష్టికి వచ్చిందని,స్థానికంగా కూడా దర్యాప్తు మొదలయిందని పోలీసు ఉన్నత స్థాయి పోలీసు వర్గాలు చెప్పాయి.