ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా అన్ని వర్గాలవారికీ న్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. పసిపిల్లల దగ్గరనుంచి, పండు ముసలివారి వరకూ అందరినీ అక్కున చేర్చుకునేపనిలో భాగంగా.. అందరికీ న్యాయం చేస్తోన్న జగన్ పై తాజాగా ఒక విమర్శ మొదలైంది! దాంతో వారంతా తాడేపల్లి వచ్చి సీఎంని కలవనిర్ణయించుకున్నారని తెలుస్తోంది!
వివరాల్లోకి వెళ్తే… వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య! ప్రతిపక్షంలో ఉండగా బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు ఇస్తామన్న జగన్, అధికారంలోకి వచ్చాక రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని చెబుతున్నారు. 4 నెలల నుంచి బ్రాహ్మణ వర్గంలోని వృద్ధులకు పింఛన్లు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో… రాష్ట్ర జనాభాలో 35 లక్షల మంది బ్రాహ్మణులున్నా… గత రెండు, మూడు దశాబ్దాల నుంచి వారు అరకొరా ప్రాతినిథ్యంతోనే సరిపెట్టుకున్నారని వాపోయారు!
అంతవరకూ ఒకెత్తు అయితే… అనంతరం ఆయన చేసిన కామెంట్లు ఇలా ఉన్నాయి! చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో ఏర్పడినాకే ఆ వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా చేయూత అందిందని.. చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని.. ఫలితంగా బ్రాహ్మణ వర్గంలోని చిన్నారుల మొదలు వృద్ధుల వరకు అందరినీ ఆదుకునేందుకు ప్రత్యేకమైన పథకాలు రూపొందించిందని చెప్పుకొచ్చారు!! అయితే… ఈయన మాటల్లో బ్రాహ్మణులపై ప్రేమ కంటే… జగన్ పై రాజకీయ విమర్శలు చేయడంపైనే మక్కువ ఎక్కువగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
సమస్య వచ్చినప్పుడు.. ప్రభుత్వం నుంచి ఫలాలు అందనప్పుడు… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.. ప్రభుత్వం స్పందించని పక్షంలో.. అప్పుడు విమర్శలు, ధర్నాలు, దీక్షలు చేస్తూ ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపాలి! కానీ.. సమస్య ఉందని చెబుతూనే రాజకీయ నాయకులను తలదన్నేలా ఈయన మాటలు ఉన్నాయనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపించడం కొసమెరుపు! దీంతో ఈ వ్యవహారంపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఎలా స్పందిస్తారనే ఆసక్తిగా మారింది!