(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో సహా 30 అంశాలపై కేబినెట్ చర్చించనున్నది.
చిన్న వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలిచే “జగనన్న చేదోడు” పథకానికి కేబినెట్ ఆమోదం తెలుపనున్నది. రాష్ట్రంలో జనవరి 2021 నుండి ప్రవేశపెట్టాలని భావిస్తున్న రేషన్ డోర్ డెలివరీపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై చర్చ, ఇసుక పాలసీలో మార్పులపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. కొత్త ఇసుక విధానంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. రాష్ట్రంలో భూముల రీ సర్వేపై చర్చించడంతో పాటు మెడికల్ కళాశాలలకు భూముల కేటాయింపుపై మంత్రివర్గం ఆమోదించనున్నది. రవాణా పన్నుల పెంపు ప్రతిపాదన, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, మచిలీపట్నం పోర్టు డీపీఆర్, పోలవరం ప్రాజెక్టు ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
అదే విధంగా కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, సభలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.