చంద్రబాబుపై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించింది జగన్ సర్కార్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు కనుగోలుల్లో అక్రమాలు జరిగాయని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కి అప్పగించాలని నిర్ణయించింది. ఈ విషయమే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. మైకుల ముందు విమర్శలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదని భావించే జగన్… సైలంట్ గా తనపని తాను పూర్తి చేస్తూ.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు!
నిన్నమొన్నటివరకూ వైకాపా నేతల విమర్శలపై.. “దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేసుకోండి… గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదు” అన్ని చెప్పిన టీడీపీ నేతాలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు… “కక్ష పూర్తిత రాజకీయాలకు ఇది నిదర్శనం” అని కామెంట్లు చేస్తున్నారు. “నిజం నిలకడమీద తెలుస్తుంది కంగారెందుకు చంద్రబాబు గారూ” అని వైకాపా కౌంటర్ వేస్తుంది. ఆ సంగతులు అలా ఉంటే… ఈ సీబీఐ ఎంక్వైరీ విషయంలో జగన్ సర్కార్ పక్కాగా ప్లాన్ చేసుకుందని, పక్కా ఆధారాలతోనే రంగంలోకి దిగిందని అంటున్నారు.
అవును… ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ అక్రమాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణ కేంద్రంగా సాగిన ఈ అవినీతి వ్యవహారంలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయని చెబుతుంది మంత్రివర్గ ఉపసంఘం. ఈ ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం ద్వారా సుమారు రూ. 200 కోట్ల మేర అవినీతి జరిగిందనే విషయం తమ ప్రాథమిక విచారణలో తేలిందని చెబుతుంది. ఇదే క్రమంలో చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక వంటి పథకాల్లో సుమారు రూ. 150కోట్ల మేర అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ చేసింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… చంద్రబాబు హయాంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ కేబినెట్ సబ్ కమిటీ పక్కా ఆధారాలు సేకరించిందని చెబుతున్నా… ముందు వరుసలో ఈ కేసులనే పెట్టింది జగన్ సర్కార్. ఇదే విషయాన్ని పేర్ని నాని పరోక్షంగా చెప్పారు కూడా. ఇది ఆరంభం మాత్రమే… ఇలా ఇది ఒక సీరియల్ గా కొనసాగుతుంది అని. ఈ క్రమంలో ఈ రెండు కేసుల ద్వారా చంద్రబాబు – లోకేష్ లూ ఒకేసారి దెబ్బతింటారని జగన్ సర్కార్ ప్లాన్ లా ఉంది! కానుకల విషయాల్లో ఎలాగూ చంద్రబాబు బుక్ అయ్యే పరిస్థితి ఉన్న క్రమంలో ఫైబర్ గ్రిడ్ విషయంలో పూర్తిగా దొరికేది నాటి ఐటీ మంత్రి లోకేష్ బాబే! ఈ ఆలోచన తోనే పక్కాగా ప్లాన్ చేసుకుని, ఆధారాలను సేకరించుకుని రంగంలోకి దిగుతుందట ఏపీ సర్కార్.