(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
నివర్ తుఫాను ప్రభావంతో ఏపిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలియజేసిన సమాచారం ప్రకారం బుధవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో పుదుచ్చేరి సమీపంలో కరైకల్ – మామళ్లపురం (మహాబలిపురం) మధ్య నివర్ తీరం దాటింది. తీరం దాటే సమయంలో 120 నుండి 145 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.
చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లోని లోటత్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావిత జిల్లాలలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుపతిలో గురువారం ఉదయం మొదలైన వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి.
తుఫాను నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవులో లోకల్ సగ్నిల్ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయగా విశాఖపట్నంలో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్ రెండో నెంబర్, కాకినాడ గంగవరం పోర్టులో నాల్గవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. నివర్ తుఫాను క్రమంగా బలహీనపడి నేటి సాయంత్రానికి వాయుగండంగా మార్పు చెందనున్నట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఇప్పటికే సహాయ చర్యల కోసం అయిదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బందాలు చేరాయి.
కాగా పుదుచ్చేరి, తమిళనాడు తీర ప్రాంతాల్లో పెనుగాలులతో అతి భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గాలులకు భారీ చెట్లు కూడా నెలకొరిగాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి.