(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఎక్కడనే అంశంపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు విశాఖలోనే ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారని ప్రచారం జరిగింది. ఇందు కోసం రిహార్సల్స్ కూడా నిర్వహించారు. కానీ చివరకు విజయవాడలోనే రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు అందాయి. దాంతో ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు.
ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈసారి అక్కడే నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అమరావతి రైతుల నిరసనలు కూడా రోజు రోజుకు పెరగడంతో విశాఖలోనే ఉంటాయని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో విజయవాడకు మారపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.