తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లకడీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీగా మధ్యాహ్నం ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హజరైయ్యారు. ఈ రోజు ఉదయం మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంజనీ కుమార్ మాట్లాడుతూ తనను డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల భద్రతకి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తీసుకురావడానికి మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు కొనసాగిస్తానని పేర్కొన్నారు అంజనీకుమార్.
అంజనీ కుమార్ 1966 జనవరి 28న బీహార్ లో జన్మించారు. ప్రాధమిక, ఉన్నత విద్యను పాట్నాలో పూర్తి చేసిన అంజనీ కుమార్.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను ఢిల్లీ యూనివర్శిటీ లో పూర్తి చేశారు. ఐపీఎస్ గా ఎన్నికైన తర్వాత 1992 లో జనగామ ఎఎస్పీగా ఆయన తన కేరీర్ ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ డీజీపీ స్థాయికి చేరుకున్నారు. 1998 లో ఐక్య రాజ్య సమితి కి డిప్యూటేషన్ పై వెళ్లి బోస్నియాలో శాంతి దళాలతో కలిసి పని చేశారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్ ను కూడా అందుకున్నారు. 2026 జనవరి లో అంజనీ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ కు పోలీస్ ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలియజేశారు.