కొలంబో (శ్రీలంక): శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పర్వదినం రోజున జరిగిన మారణ హోమం మరువక ముందే మరో బాంబు పేలుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
బుధవారం కొలంబోలోని ఒక సినిమా ధియేటర్ వద్ద మోటారు బైక్లో దుండగులు పెట్టిన బాంబు పేలింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ నెల 21న ఈస్టర్ పర్వదినం రోజు కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన విషయం విదితమే. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకూ 359మంది మృతి చెందగా ఇందులో 38మంది విదేశీయులు ఉన్నారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన శ్రీలంక భద్రతా యంత్రాంగం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నా అక్కడక్కడా బాంబులు పేలుతూనే ఉన్నాయి. ముష్కరులు మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలతో కొలంబో వాసులు ఆందోళన చెందుతున్నారు. బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఇప్పటికి 58మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.