రాజకీయాలు ఎంతో చిత్రమైనవి. అంతు చిక్కని పరిణామాలకు పాలిటిక్స్ కేరాఫ్ అడ్రస్ . అదే రీతిలో అయోమయం కలిగించే విమర్శలు , ప్రతి విమర్శలకు సైతం అదే రాజకీయాలు చిరునామా.
అలాంటి రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తాజాగా వచ్చిన విమర్శ . ఇంకా చెప్పాలంటే గతంలో వచ్చిన విమర్శే తాజాగా కూడా వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ లాలూచీ పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
సీఎం జగన్పై ఇంకో ఆరోపణ
బహుళార్థకసాధక ప్రాజెక్టు, 13 జిల్లాలకు వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం, కేసుల మాఫీ కోసం పక్క రాష్ట్రాలతో రాజీపడి రైతులకు ఉరితాడు వేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. “పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టిస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పోలవరం గురించి మాట్లాడుతుంటే.. టేపు తెచ్చుకోవాలని ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును 18 నెలలుగా పట్టించుకోవడం లేదు. పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు ఎందుకు ఆపేశారని పోలవరం లెఫ్ట్ కెనాల్, పురుషోత్తమపట్నం ఉండగా.. విశాఖకు పైప్ లైన్లు వేస్తామని మాట్లాడుతున్నారు. పైప్ లైన్లలో ఎంత కమీషన్లు మాట్లాడుకున్నారు? “ అంటూ విరుచుకుపడ్డారు.
కేసీఆర్ తో …
“ పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు పరిగెత్తడం లేదు. పురుషోత్తం పనులు ఎందుకు ఆగిపోయాయి? మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు? రెండేళ్లు మేం నడిపించి చూపించాం. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో ఎందుకు లాలూచీపడ్డారు? చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండా ఢిల్లీ వెళ్లి, ప్రధానిని ఒప్పించి 7 ముంపు మండలాలను ఏపీలో కలిపి పోలవరం కలను సాకారం చేయడం జరిగింది. సీలేరు, శబరి, జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల గోదావరి డెల్టాలో రెండో పంటకు ఇబ్బంది లేకుండా ఐదారేళ్లుగా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. ఇవాళ సీలేరు, శబరి, 7 ముంపు మండలాలను గాలికి వదిలేశారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. ఎవరికి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 11న జరిగిన రివ్యూ మీటింగ్ లో, మీ అధికారులు ఇచ్చిన నోట్ లో 41.15 మీటర్లకే భేసకరణ, ల్యాండ్ అక్విజేషన్, డ్యాం పనులు చూస్తామని చెప్పారు. డ్యాం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు మీరు రాజీపడ్డారు. 150 అడుగులు కట్టాల్సిన డ్యాంను 135 అడుగులకే భూసేకరణ, పరిహారంకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. దీంతో 5 కోట్ల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.“ అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.
ఇంకో ఆరోపణ
పోలవరం ప్రాజెక్టుకు ఎవరెంత ఖర్చుపెట్టారో దమ్ముంటే బయటపెట్టాలని దేవినేని ఉమా సవాల్ విసిరారు. “హైదరాబాద్ లో ఆస్తుల కాపాడుకునేందుకు కేసీఆర్ తో లాలూచీ పడి సీలేరు, శబరిని తాకట్టు పెట్టే హక్కు జగన్ కు లేదు. వీటిపై సమాధానం చెప్పాలి. వైఎస్, జగన్ పాపాల వల్ల పోలవరంలో నష్టపోయింది రూ.10వేల కోట్లు. జగన్ నోరు తెరవాలి. “ అని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఈ ఘాటు విమర్శలపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.