బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు గణనీయమైన ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఇప్పటికే బంగారు పతకం సహా నాలుగు పతకాలు కైవశం చేసుకోగా తాజాగా భారత్ కు మరో బంగారు పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లో 67 కేజీల విభాగంలో 19 ఏళ్ల జెరెమీ లాల్ రినుంగ స్వర్ణం సాధించాడు. క్లీన్ అండ్ జర్క్ లో 160 కేజీల తో కలిపి మొత్తం 300 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ లో రికార్డు సృష్టించడంతో పాటు బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నాడు. చివరి ప్రయత్నంలో లాల్ రినుంగ గాయపడినప్పటికీ క్రీడాస్పూర్తి కనబర్చి భారత్ శిబిరంలో ఆనందోత్సాహాలను నింపాడు.
ఈ పతకంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య అయిదుగు పెరిగింది. ఈ అయిదు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే లభించడం గమనార్హం. ఇప్పటి వరకూ వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ రెండు బంగారు. రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. పతకాల పట్టికలో భారత్ ఆరవ స్థానానికి చేరింది. మీరా బాయి ఛాను ఇప్పటికే స్వర్ణం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో మరో స్వర్ణ పతకాన్ని సాధించిన జెరిమీ లాల్ నిరుంగను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు ట్విట్టర్ వేదికగా అభినందించారు.