రెండో దఫా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
త్వరలో 50 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ఇందుకోసం వివిధ శాఖలలోని ఖాళీల వివరాలను సేకరించాలని ఆదేశించారు. అయితే, దీనిపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. అదే సమయంలో ఇంకో గుడ్ న్యూస్ తెరమీదకు వచ్చింది.
తెలంగాణ సీఎం ఆర్డర్ వేసేశారు…
తెలంగాణ సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… 50 వేల పోస్టులను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా, అన్ని శాఖలు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలన్నారు. అధికారులు ఖాళీల వివరాలను నిర్ణీత ప్రోఫార్మాలో సమర్పించాలని ఆదేశించారు. ఈ వివరాలను క్రోడీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్కు సమర్పించవలసి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.
ఉద్యోగాల భర్తీ ఇంకో గుడ్ న్యూస్ ….
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అవసరమైన మార్పులు, సంస్కరణలను తీసుకురావడం ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. వివిధ శాఖలలో ని ఖాళీలను భర్తీ చేయడానికి సరైన మెకానిజాన్ని అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ వేగంగా ముందుకు సాగనున్నట్లు పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.