ఏపీ రాష్ట్రంలో మరో దారుణ హత్య జరిగింది.నేరాలు ఘోరాలు హద్దూ అదుపూ లేకుండా సాగిపోతున్నాయి. ఏపీ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ఒకవైపు ప్రశంసలందుకున్నప్పటికీ మరోవైపు నేరాలు మాత్రం అదుపుకావడంలేదు.
నిత్యం ఎక్కడో ఒకచోట హత్య పరిపాటిగా మారింది.మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.తాజాగా అనంతపురం జిల్లాలో ధర్మవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ కింద పని చేస్తున్న ఉద్యోగినిని దారుణంగా చంపేశారు. హత్య చేసిన అనంతరం ఆ యువతిని దహనం చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముందే పట్టించుకుంటే..ఈ ఘోరం జరిగి ఉండేది కాదని విలపిస్తూ చెబుతున్నారు తల్లిదండ్రులు. బడనపల్లి పొలాల్లో ఓ యువతి హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. హత్య చేసిన అనంతరం గుర్తు పట్టకుండా ఉండేందుకు దహనం చేశారు నిందితులు. హత్యకు గురైన యువతి..స్నేహలతగా పోలీసులు గుర్తించారు.
ఆమె ఎవరు?
ఈమె…ధర్మవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ కింద పని చేస్తోందని తేలింది. అనంతపురం నుంచి ధర్మవరం ఎస్బీఐకి బైక్ మీద వెళుతూ ఉంటుంది. కొంతకాలంగా..స్నేహలతను రాజేశ్, కార్తీక్ అనే యువకులు వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. వేధింపులపై ఫిర్యాదు చేసినా..పోలీసులు పట్టించుకోలేదని విలపిస్తూ చెప్పారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా..మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. డిసెంబర్ 22వ తేదీ మంగళవారం రాత్రి కంప్లైట్ ఇచ్చారని వెల్లడిస్తున్నారు. ఫిమెల్ డెడ్ బాడీ ఉందని సమాచారం అందిందని, అనంతరం దర్యాప్తు చేపట్టామన్నారు. అమ్మాయి పేరెంట్స్ కంప్లైట్స్ చేశారని, డెడ్ బాడీని చూసి స్నేహలతగా నిర్ధారించామన్నారు.కాగా అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న నేరాల పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.