ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, సంక్షేమ పథకాల విషయంలో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్నారు.
తాజాగా ఆయన మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టారు. ఫుట్పాత్ లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే వ్యాప్తారులకు రూ.10వేల చొప్పున రుణాలు అందించే “జగనన్న తోడు” పథకాన్ని ఈ నెల 6న సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
చిన్న వ్యాపారుల కష్టాలు తీర్చేలా…
ఫుట్ పాత్లు, వీధుల్లో వ్యాపారాలు చేసుకునే వారికి ప్రధానంగా ఎదురయ్యేది నిధుల సమస్య. ఫుట్పాత్లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు, అమ్ముకుని జీవనం సాగించే వారితోపాటు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బుట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారు తమ వృత్తిని కొనసాగించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. వారికి రుణ సదుపాయం ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
అప్పు ఇవ్వడమే కాదు అంతకు మించి….
జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతోపాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. తీసుకున్న రుణాన్ని వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇటు వ్యాపారులే కాకుండా అటు సంప్రదాయ వృత్తిదారులు సైతం లబ్ధి పొందనున్నారు. ఫుట్పాత్లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు, అమ్ముకుని జీవనం సాగించే వారితోపాటు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బుట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారంతా ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. దీంతోపాటుగా సంప్రదాయ వృత్తులైన ఇత్తడి పని చేసే వారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మల అమ్మకందారులతో పాటు కుమ్మరి వారికి సైతం ఈ పథకం కింద రుణాలు ఇస్తారు. ఈ పథకం చిన్న వ్యాపారుల జీవితాలను మార్చివేసేదని పలువురు విశ్లేషిస్తున్నారు.