కర్నూలు జిల్లాలో మరో వివాదం చోటు చేసుకుంది.ఒక వైసిపి నాయకుడు తమను చితకబాదారని ఆలయ అర్చకులు చెబుతున్నారు.ఇప్పటికే కర్నూలు జిల్లా నంద్యాలలో సలామ్ అనే ఆటో డ్రైవర్ కుటుంబంతో సహా పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం రాష్ర్టాన్ని అట్టుడికిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఉదంతంలో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి కేసులు పెట్టినప్పటికీ వారికి వచ్చిన బెయిలును రద్దు చేసినప్పటికీ కూడా ఆ వివాదం ఇంకా సద్దుమణగలేదు.మంగళవారం కూడా విజయవాడలో ఇండియన్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ఇదే ఘటనకు సంబంధించి ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు .ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వాన్ని ముస్లిం నేతలు ఏకిపారేశారు.సలాం విషాద ఉదంతంతో మైనారిటీ వర్గాలు అధికార వైసిపి పై గుర్రుగా ఉన్నారు.ఇదిలా ఉండగానే అదే కర్నూలు జిల్లాలో ఈసారి అర్చకులపై దాడి జరిగింది.బండి ఆత్మకూరు గ్రామం లోని ఓంకార క్షేత్రం లోని అర్చకులపై ఆ ఆలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.
మహా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఓంకార్ క్షేత్రంలోని గర్భాలయంలో ఈ అమానుష సంఘటన చోటు చేసుకుంది.ఆలయ అర్చకుల కథనం ప్రకారం ఓంకార్ క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు టిక్కెట్ పై భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు.ఐదు గంటల తర్వాత ఉచిత దర్శనం ఉంటుంది.కానీ కార్తీక పౌర్ణమి రోజున రాత్రి ఏడున్నర గంటలకి కూడా టిక్కెట్లపైనే భక్తులను దర్శనానికి పంపుతుండగా ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులు బారులు తీరారు.దీంతో ఆలయ అర్చకులు టిక్కెట్లు ఇస్తున్న వ్యక్తిని ఇక టిక్కెట్లు ఆపేసి ఉచిత దర్శనాన్ని ప్రారంభించాలని కోరగా గొడవ మొదలైంది.సదరు వ్యక్తి అర్చకులను దూషించగా ఒకరినొకరు నెట్టుకున్నారు.
దీంతో ఆలయ గుమాస్తా ట్రస్టుబోర్డు చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన పది మందిని వెంటేసుకుని వచ్చి తమను గర్భాలయంలో మహా శివుని ఎదుటే చితకబాదారని పూజారులు సుధాకర్ శర్మ ,మృగపాణి శర్మ చక్రపాణి శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా జరిగిన విషయాన్ని వివరిస్తూ ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టారు.ఆ వీడియోలో పూజారులు గాయపడ్డ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈ సంఘటన వెలుగులోకి రాగానే ఆది శైవ అర్చక సంఘం రాష్ట్ర శాఖ రంగంలోకి దిగింది. మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఈ వివాదం జగన్ ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారే అవకాశముంది.అప్పుడే తెలుగుదేశం పార్టీ ఈ ఘటన విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైసిపి ప్రభుత్వంపై ధ్వజమెత్తింది.ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి