(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగా అమెరికా నుండి 1.8 బిలియన్ డాలర్ల విలువైన మరో నాలుగు బోయింగ్ పొసిడాన్ 8 ఐ విమానాలను కొనుగోలుకు ఇంతకు ముందే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆమెరికా రూపొందించిన ఈ విమానం బుధవారం గోవాలోని ఐఎన్ఎన్ హాన్స నౌకా స్థావరంలో దిగింది.
అమెరికా అందిస్తున్న నాలుగు పి 8 ఐ యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. మిగిలిన మూడు పి 8 ఐ విమానాలు వచ్చే ఏడాది సిద్ధమవుతాయి. కాగా ఇప్పటికే భారత్ వద్ద 8 పి 8 ఐ విమానాలు ఉన్నాయి. వీటిని హింధూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకలు, జలాంతర్గాములపై నిఘా వేయడానికి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లద్ధాఖ్ ప్రాంతంలో గస్తీకి కూడా వీటిని రంగంలోకి దింపారు.
పొసిడాన్ 8ఐ యుద్ధ విమానం ప్రత్యేకతలు ఏమిటంటే..
సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుండే శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడుతుంది. అత్యాధునిక శక్తివంతమైన ఎలక్ట్రో అప్టిక్ సెన్సర్ల వ్యవస్థతో, రాడార్ల సహాయంతో జలాంతర్గాముల అనుపానులు కనిపెట్టి ఆయుధాలతో విరుచుకుపడటం దీని ప్రత్యేకత. 907 కిలో మీటర్ల గరిష్ట వేగంతో 1200 నాటికల్ మైళ్ల పరిధి నిఘా సామర్థ్యంతో ఏకధాటిగా నాలుగు గంటల పాటు గస్తీ తిరిగే సౌలభ్యం ఈ విమానాలకు ఉంది.